అమిత్ షా కు కరోనా పాజిటివ్ - ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి - కీలక సందేశం..
ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత దేశ రాజకీయాలు, పాలనలో నంబర్ 2గా కొనసాగుతోన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా వైరస్ కాటుకు గురయ్యారు. కొద్ది రోజులుగా కొవిడ్ లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు వైరస్ సోకినట్లు ఆదివారం నిర్ధారణ అయింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు.
Recommended Video
అయోధ్యకు అద్వానీ వెళ్లరు: వీడియోలోనే - ముందుగా 'హనుమాన్ గధీ’కి మోదీ.. కరోనా కట్టడికీ పూజలు..
అమిత్ షాకు కరోనా సోకిందన్న వార్త బీజేపీ వర్గాలు, అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. దీంతో తన ఆరోగ్య స్థితిని షా స్వయంగా వెల్లడించారు. ప్రస్తతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే, డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో చేరానని హోం మంత్రి తెలిపారు. అంతేకాదు, గడిచిన కొద్ది రోజులుగా తనకు దగ్గరగా మసులుకున్నవాళ్లందరూ వెంటనే ఐసోలేషన్ కు పరిమితం కావాలని, టెస్టులు చేయించుకోవాలని షా ట్విటర్ ద్వారా సందేశమిచ్చారు.
కేంద్రం నేరుగా జోక్యం చేసుకున్న తర్వాత ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, కేంద్ర హోం మంత్రికి కరోనా ఎలా సోకిందనేది వెల్లడి కావాల్సి ఉంది. గడిచిన 4 రోజులుగా దేశవ్యాప్తంగా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,736 మంది ఇన్ఫెక్షన్ కు గురికాగా, 853 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17.6లక్షలకు, మరణాల సంఖ్య 37,452కు పెరిగింది. రికార్డు స్థాయిలో 11.5లక్షల మంది ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5.7లక్షలుగా ఉంది. ఇకపోతే,
బీజేపీకి చెందిన సీనియర్లు వరుసగా కరోనా బారిన పడుతుండటం కాషాయ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి చెందిన పైడికొండల మాణిక్యాలరావు శనివారం కన్నుమూయగా, ఉత్తరప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకురాలు, ఆ రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమలా రాణి వరుణ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. నేతల మరణాలపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వల్ప లక్షణాలే అయినప్పటికీ అమిత్ షా ఆస్పత్రి పాలైన తర్వాత, ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖ నేతలు ట్వీట్లు చేశారు.