రాహుల్ క్షమాపణ చెప్పాలి, ఆధారాలుంటే వాటిని కోర్టుకు తీసుకెళ్లలేదేం: అమిత్ షా డిమాండ్
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందం విషయంలో దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం అన్నారు. ఆయన మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. రాఫెల్ డీల్ పైన చేసిన ఆరోపణలకు రాహుల్ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
మోడీకి ఊరట, రాహుల్ గాంధీ అబద్దాలకు సుప్రీం కోర్టు చెంపదెబ్బ: రాఫెల్ డీల్పై అమిత్ షా
దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. రాఫెల్ డీల్ విషయంలో ఒక అబద్దాన్ని పదేపదే ప్రచారం చేశారని మండిపడ్డారు. రాఫెల్ పైన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టించిందని చెప్పారు. అబద్దాలు ప్రచారం చేసిన వారికి సుప్రీం కోర్టు తీర్పు చెంప దెబ్బ అన్నారు. రాఫెల్ విమానాల వల్ల దేశానికి మేలు జరిగిందని చెప్పారు.
సుప్రీం కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. నిజం ఎప్పటికీ గెలుస్తుందని చెప్పారు. దేశంలోని అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టించిందన్నారు. అబద్దాలు ప్రచారం చేసే అలాంటి వారికి సుప్రీం కోర్టు తీర్పు దెబ్బ అన్నారు. అసలు అలాంటి ఆరోపణలు చేయడానికి అతని వద్ద ఉన్న ఆధారాలు ఏమిటో చెప్పాలని నిలదీశారు.
ఆకాశం పైన ఎంత మట్టి వేసినా, ఉమ్మేసినా అది తిరిగి మన మీదే పడుతుందని చెప్పారు. అసలు కాంగ్రెస్ వద్ద అన్ని ఆధారాలు ఉంటే సుప్రీం కోర్టుకు వాటిని పట్టుకొని ఎందుకు వెళ్లలేదని అడిగారు. కాంగ్రెస్ పార్టీ జేపీసీ కోసం డిమాండ్ చేస్తోందని, దానికి తాము సిద్ధమని చెప్పారు. కానీ చర్చ జరిగేందుకు విపక్షాలు ఆస్కారం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.