2019కి బీజేపీ స్ట్రాటజీ: చిన్న పార్టీల వైపు కమలం పార్టీ చూపు
భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికలకు సమాయత్తమవుతోందా..? ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్షపార్టీలు ఏకమవుతుండటంతో కమలం పార్టీ పావులు చురుగ్గా కదుపుతోందా... అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 ఎన్నికల సమయానికల్లా తమతో ఆయా రాష్ట్రాల నుంచి కలిసి వచ్చే కొత్త మిత్రుల కోసం బీజేపీ అన్వేషిస్తోంది. ఇలా చేయడం ద్వారా ఓట్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడిన విపక్షాలకు కౌంటర్ ఇవ్వొచ్చనేది కమలం పార్టీ ప్లాన్గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్ని రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులకు కొత్త మిత్రుల కోసం అన్వేషించాల్సిందిగా హుకుం జారీ చేశారు. అమిత్ షా రాష్ట్రాల పర్యటనకు వచ్చిన సమయంలో అధ్యక్షులు జాబితాను సిద్దం చేసి ఉంచాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వాన్ని ఈ పనికి పురమాయించడం వెనక వ్యూహాత్మకమేనని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీల ప్రభావం జాతీయ స్థాయిలో లేనప్పటికీ... ఆ రాష్ట్రంలోని సామాజిక వర్గాలను మాత్రం కచ్చితంగా ప్రభావం చూపుతాయన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నట్లు తెలుస్తోంది.
బీహార్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, యూపీలో సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, అప్నాదల్ లాంటి పార్టీలతో 2014లో పొత్తు పెట్టుకోవడం వల్ల భారీగా సీట్లు గెలిచినట్లు బీజేపీ గుర్తు చేసుకుంటోంది. ఇదే స్ట్రాటజీని 2019కి కూడా అమలు చేయాలనే యోచనలో కమలం పార్టీ అధినాయకత్వం యోచిస్తోంది. 2014లో 28 చిన్న పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోవడంవల్ల ఎన్డీఏ 334 సీట్లు పొందిందని గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో 282 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. ప్రస్తుతం మోడీ వ్యక్తిగత పాపులారిటీకి ఎలాంటి భంగం వాటిల్లనప్పటికీ.... 2019కల్లా కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని... మరో 20 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై రెట్టింపు స్థాయిలో వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న శక్తులు కేంద్రం స్థాయిలో ప్రభావం చూపకపోయినప్పటికీ రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే బీజేపీని ఇరుకున పెడుతోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్,బీఎస్పీ,ఎస్పీ, ఆర్ఎల్డీ, ఆర్జేడీ, జేఎంఎం జేవీఎం కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఉంటే బీజేపీ 64 సీట్లు కోల్పోయి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 2019కి యూపీలో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు పొత్తు పెట్టుకుంటే బీజేపీ 49 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో 80 సీట్లకు గాను 71 సీట్లు గెలిచింది. ఇందుకోసమే అమిత్ షా చిన్న పార్టీలపై కన్నేసినట్లు సమాచారం.
మరోవైపు రాష్ట్రాల్లో కూటమిగా ఏర్పడిన పార్టీల్లో ఏమైనా లొసుగులు ఉన్నా... వారి మధ్య బేధాభిప్రాయాలు బయటపడ్డ వెంటనే క్యాష్ చేసుకునేందుకు రెడీగా ఉండాలని కమల దళపతి అమితిషా రాష్ట్ర అధ్యక్షులకు చెప్పినట్లు తెలుస్తోంది. విపక్ష పార్టీల్లో ఏమి జరుగుతోందో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి... సమయం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాల్సిందేనని... విపక్ష పార్టీలో ఉన్న తమ మిత్రుల దగ్గరునుంచి సమాచారం సేకరిస్తేనే తమ వ్యూహం వర్కౌట్ అవుతుందని చెబుతున్నారు ఓ రాష్ట్రానికి చెందిన బీజేపీ అధ్యక్షుడు. అంతేకాదు అమిత్ షా జరిపిన సమీక్ష సమావేశంలో రాష్ట్రాల్లో విజయావకాశాలున్న పార్టీలపై కన్నేసి అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలపై జాబితాను తయారు చేయాల్సిందిగా అమిత్ షా ఆదేశించినట్లు సమాచారం. ఈ సమస్యలు పరిష్కరించి ఓట్లను తమవైపు తిప్పుకునే స్ట్రాటజీ కూడా ఇంప్లిమెంట్ చేసే యోచనలో కమలం పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది.