రైతుల రచ్చపై కేంద్రం సీరియస్- అమిత్షా అత్యవసర భేటీ- కీలక నిర్ణయాలు ?
ఇవాళ ఢిల్లీలో రైతుల ఆందోళనలు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం సీరియస్ అయింది. ముఖ్యంగా ఎర్రకోటపై రిపబ్లిక్ డే రోజు జెండాఎగరవేయడం, ట్రాక్టర్లతో పోలీసులపైకి దూసుకెళ్లడం వంటి విషయాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్షా మధ్యాహ్నం తర్వాత ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై వివరాలు తీసుకుంటున్నారు.
అమిత్షా నిర్వహిస్తున్న సమావేశంలో హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో పాటు ఢిల్లీ పోలీసు కమిషనర్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొంటున్నారు. ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని, ఎర్రకోట పరిసర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లను ఖాళీ చేయించామని అధికారులు అమిత్షాకు తెలిపారు. ఈ రాత్రి కల్లా ఢిల్లీ నుంచి పూర్తిగా ట్రాక్టర్లు ఖాళీ చేయించనున్నట్లు వారు వివరించారు. ఈ భేటీలో అమిత్షా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో తాజా పరిస్ధితిపై సమీక్ష అనంతరం పరిస్ధితి అదుపులోకి రాకపోతే పారామిలిటరీ బలగాలను దించడంతో పాటు పలు ఇతర అంశాలపైనా అమిత్షా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. రైతులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించడానికి కారణాలు ఏంటి, సంఘ విద్రోహక శక్తుల ప్రమేయం, విపక్షాల మద్దతు వంటి అంశాలపైనా కేంద్రం నిఘా వర్గాల ద్వారా వివరాలు సేకరిస్తోంది. అలాగే ఇవాళ్టి ఘటనలపై బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలూ లేకపోలేదని తెలుస్తోంది.