బెంగాల్లో అమిత్షా సమరశంఖం- బీజేపీకి 200 సీట్లని జోస్యం- సువేందు చేరిక
పశ్చిమబెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇవాళ సమరశంఖం పూరించారు. ఎన్నికల్లో గెలవాలంటే అధికార తృణమూల్ కాంగ్రెస్పై ఏదో రకంగా పైచేయి సాధించక తప్పని పరిస్దితుల్లో బెంగాల్లో అడుగుపెట్టిన అమిత్షా .. సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. ఆమె తన మేనల్లుడిని సీఎం చేసేందుకే ఆరాటపడుతోందన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి సువేందు అధికారి ఇవాళ అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు టీఎంసీ రెబెల్ నేతలు సునీల్ మండల్, సిభద్రా దత్తా కూడా కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్షా.. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మమత ఇతర పార్టీల నుంచి బీజేపీ నాయకులను తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు.
ఆమె కాంగ్రెస్లో ఉన్నప్పటి రోజులు గుర్తుచేసుకోవాలి, ఆమె ఎందుకు భయపడుతున్నారని అమిత్షా ప్రశ్నించారు. తామెందుకు అలా ఉండిపోవాల్సి వస్తోందని యువత ప్రశ్నించుకోవాలి, మీకు ఎందుకు కేవలం కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలు మాత్రమే అందుతున్నాయని రైతులు ప్రశ్నించాలని అమిత్షా కోరారు.
మీరు కాంగ్రెస్కు మూడు దశాబ్దాలు, కమ్యూనిస్టులకు 27 సంవత్సరాలు, మమతా బెనర్జీకి పదేళ్లు అధికారమిచ్చారు. బీజేపీకి ఐదేళ్లు అధికారమిచ్చి చూడండి సోనార్ బంగ్లా చేసి చూపిస్తామంటూ బెంగాల్ ప్రజలను అమిత్షా కోరారు. బెంగాల్ మొత్తం మమతు వ్యతిరేకంగా ఉందని, ఇక్కడి రైతులు, శ్రామికుల సమస్యలను ప్రధాని మోడీ చూసుకుంటారని షా అన్నారు. సువేందు అధికారితో పాటు ఇతర నేతలు బీజేపీలో చేరడం సోనార్ బంగ్లా కోసమేనన్నారు. బెంగాల్లో ఈసారి తాము 200 పైగా సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అమిత్షా ధీమా వ్యక్తం చేశారు.