ఇక నీ ఇష్టం!: యడ్యూరప్పకు అమిత్ షా ఫోన్, ఆజాద్కు రాహుల్-సోనియా ఫోన్
బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం మధ్యాహ్నం కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో మాట్లాడారు. యెడ్డీ సీఎం పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో అమిత్ షా ఫోన్ చేయడం గమనార్హం. రాజీనామా చేయాలా ఫ్లోర్ టెస్టుకు వెళ్లాలా అనే నిర్ణయాన్ని అమిత్ షా.. యెడ్డీకి వదిలేశారని తెలుస్తోంది.
హార్స్ ట్రేడింగ్ నేపథ్యంలో రాజీనామాకు ఆదేశించారా, ప్రజల ఆగ్రహం నేపథ్యంలో ఇలాంటి చర్యల కారణంగా పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని భావించి, గౌరవప్రదంగా రాజీనామా చేయాలని ఆదేశించారా అనే చర్చ సాగుతోంది.
మరోవైపు, సంఖ్యాబలం పైన బీజేపీ నేతల నమ్మకం కూడా సడలుతోంది. బలపరీక్ష నెగ్గే పరిస్థితి లేదని బీజేపీకి అర్థమయిందని అంటున్నారు.
ఆజాద్కు రాహుల్, సోనియా ఫోన్
మరోవైపు, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కర్ణాటకలో ఉన్న పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు ఫోన్ చేశారు. కర్ణాటక పరిస్థితులపై ఆరా తీశారు. మిస్సైన ఎమ్మెల్యేలు తిరిగి తమ వద్దకు వచ్చారని కాంగ్రెస్ నేతలు అధిష్టానంకు చెప్పారు.