మోడీ 2.0 కేబినెట్ : హోం మంత్రిగా అమిత్ షా? జైట్లీని పక్కన బెట్టే ఛాన్స్..!
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ప్రధానిగా నరేంద్రమోడీ మరోసారి అధికారపగ్గాలు చేపట్టనున్నారు. ఆయన నేతృత్వంలో కొలువుదీరనున్న ప్రభుత్వంలో ఈసారి కొత్త ముఖాలు కనిపించే అవకాశముంది. పాతవారిని పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేసినవారికి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కీలక శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఈసారి కేబినెట్లో కొందరికి ప్రమోషన్ ఇవ్వనున్న మోడీ మరికొందరిని పక్కనబెట్టే ఛాన్సుంది.
26 ఏళ్లకే ఎంపీ : ఎస్టీ మహిళగా చంద్రానీ రికార్డు, ప్రత్యర్థిపై 66 వేల ఓట్లతో విజయం
అమిత్ షాకు హోం శాఖ?
సార్వత్రిక ఎన్నికల్లో మోడీ, షా ద్వయం సంచలనాలు సృష్టించింది. బీజేపీకి ఊహించని విజయాన్ని కట్టబెట్టింది. పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేసిన అమిత్ షా తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. తొలిసారి లోక్సభలో అడుగుపెట్టనున్ ఆయనకు ప్రధాని మోడీ.. హోంశాఖ బాధ్యతలు అప్పజెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమ యంలో అమిత్ షా ఆ రాష్ట్ర హోం మంత్రిగా పనిచేశారు. ఇదిలా ఉంటే అమిత్ షాను కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో సభ్యుడిగా తీసుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. సీసీఎస్లో ప్రధానితో పాటు డిఫెన్స్, హోం, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు హోం శాఖ బాధ్యతలు అప్పజెప్పనున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
నిర్మలకే రక్షణ బాధ్యతలు
మోడీ 2.0 కేబినెట్లో రక్షణ శాఖ బాధ్యతలు నిర్మలా సీతారామన్కే అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రాఫెల్ డీల్ విషయంలో ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను ఆమె తిప్పికొట్టిన తీరుపై సంతృప్తితో ఉన్న ప్రధాని మరోసారి రక్షణ శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం. క్రైసిస్ మేనేజర్గా పేరున్న రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్కు మరింత కీలమైన పోర్ట్ ఫోలియా కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జైట్లీ కొనసాగింపుపై అనుమానం
కొత్త కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీని కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయమ్స్లో చికిత్స తీసుకుని గురువారం డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వానికి అనేక ఆర్థిక సవాళ్లు ఎదురుకానున్నాయి. జైట్లీకి వాటిని ఎదుర్కొనే సత్తా ఉన్నప్పటికీ ఆరోగ్యం సహకరించని కారణంగా ఈసారి ఆయనను పక్కన బెట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత మూడు వారాలుగా ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫీసులో అడుగుపెట్టిన అరుణ్ జైట్లీ ఈ ఏడాది జనవరిలో అమెరికాలో క్యాన్సర్ సర్జరీ చేయించుకున్నారు.
సుష్మాకు ఛాన్స్ లేదు
ఎన్డీఏ వన్లో విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె రెండు సభల్లో సభ్యురాలు కానందున ఈసారి ఏ పోర్ట్ఫోలియో దక్కే అవకాశం లేదు. అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి జెయింట్ కిల్లర్గా నిలిచిన స్మృతి ఇరానీ గతంలో టెక్స్టైల్ మినిస్టర్గా ఉండగా.. ఈసారి కీలక పదవి దక్కే అవకాశముంది. చాలా కాలం తర్వాత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన రవిశంకర్ ప్రసాద్, యూపీ ఘాజియాబాద్ నుంచి భారీ మెజార్టీ సాధించిన వీకే సింగ్లకు కీలక పోర్ట్ ఫోలియోలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి ఎంపికైన ఎంపీలకు కేబినెట్లో చోటు దక్కే అవకాశముంది.