ఏకాంత చర్చలు, అమిత్ షాపై ఉద్ధవ్ ప్రశ్నల వర్షం, గది బయట సీఎం!: 2గం. పాటు భేటీ
ముంబై: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బుధవారం శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ థాకరేను ఆయన నివాసం మాతోశ్రీలో కలిశారు. వారిద్దరి మధ్య దాదాపు రెండు గంటల పాటు భేటీ జరిగింది. ఉద్ధవ్ - అమిత్ షాలు ఓ గదిలో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పాల్గొనలేదని తెలుస్తోంది.
చదవండి: ఉద్ధవ్ను కలిసేందుకు వచ్చిన అమిత్ షాకు శివసేన షాక్, మాధురీ దీక్షిత్తో బీజేపీ చీఫ్ భేటీ
ఉద్ధవ్ నివాసానికి సీఎం ఫడ్నవీస్తో కలిసి వెళ్లిన అమిత్ షాకు ఉద్ధవ్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఫడ్నవీస్ లేకుండానే ఉద్ధవ్, అమిత్ షా గంటకు పైగా చర్చలు జరిపారు. ఫడ్నవీస్ మరో గదిలో వేచి చూస్తుండగా వీరిద్దరూ ఏకాంతంగా గంటకు పైగా చర్చించారు.
2019 ఎన్నికల పైనా చర్చ
తాజాగా నెలకొన్న విభేదాలతో సహా అన్ని అంశాలపై అమిత్ షా, ఉద్ధవ్ థాకరేలు చర్చించారని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చ జరిగిందని సమాచారం. సంపర్క్ ఫర్ సమర్థన్ యాత్రలో భాగంగా అమిత్ షా దేశంలోని ప్రముఖులందరినీ కలుస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన అధినేతను కలుసుకున్నారు. చాలాకాలంగా శివసేన- బీజేపీ మధ్య ఉప్పు నిప్పులా ఉంది.
ఇప్పుడెందుకు కలుస్తున్నారని సామ్నా ప్రశ్న
2019 సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ఇప్పటికే ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికలోల బీజేపీ ఓటమిపాలయిన తర్వాత ఇప్పుడు ఈ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో ప్రశ్నించింది. అనంతరం బుధవారం భేటీ జరిగింది. ఉద్ధవ్ ఇంటికి అమిత్ షా, ఫడ్నవీస్ రాగా ఉద్ధవ్తో పాటు ఆయన తనయుడు ఆదిత్య కూడా ఆహ్వానం పలికారు.
భేటీ సానుకూలం, మరో రెండుమూడుసార్లు
మరోవైపు, ఈ రెండు పార్టీల అధినేతల భేటీపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, బీజేపీ వర్గాలు మాత్రం భేటీ సానుకూలంగా జరిగినట్లు చెబుతున్నారు. శివసేన అధినేతతో మరో రెండు మూడు భేటీలు జరగనున్నాయని చెబుతున్నారు. మాధురీ దీక్షిత్, రతన్ టాటాలతో అమిత్ షా భేటీ అయిన సమయంలో బీజేపీ మహారాష్ట్ర చీఫ్ రావుసాహెబ్ దన్వే ఉన్నారు. ఉద్ధవ్తో భేటీ సమయంలో లేరు.
ఉద్ధవ్ ప్రశ్నలు సంధించారా?
అమిత్ షాతో ఓ క్లోజ్డ్ రూంలో భేటీ సందర్భంగా ఉద్ధవ్ ప్రశ్నల వర్షం కురిపించి ఉంటారని అంటున్నారు. మిత్రపక్షాలను ఎన్డీయే సమన్వయం సరిగా చేసుకుపోవడం లేదని, వాజపేయి సమయంలో వలె లేదని చెప్పారని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర బీజేపీ నాయకత్వం పైన కూడా ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వంలోను శివసేన మంత్రులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కొన్ని సమయాల్లో పూర్తిగా విస్మరిస్తున్నారని చెప్పారని తెలుస్తోంది.
సంపర్క్ ఫర్ సమర్థన్-మాధురీ దీక్షిత్, రతన్ టాటా
అమిత్ షా అంతకుముందు పలువురు సినీ, వ్యాపార ప్రముఖులతో భేటీ అయ్యారు. తొలుత బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ దంపతులను కలిశారు. ఆ తర్వాత రతన్ టాటాను కలిశారు. సంపర్క్ ఫర్ సమర్థన్ ప్రచారంలో భాగంగా అమిత్షా.. ఇటీవల రామ్ దేవ్ బాబాను కూడా కలిశారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల కాలంలో ప్రధాని మోడీ హయాంలో దేశంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్టు కార్డును వారికి అందిస్తున్నారు.