లేటైనా లేటెస్ట్గా.. పెద్దాయనను కలసిన అమీత్ షా! అద్వానితో అంతా సర్దుకున్నట్టేనా ?
న్యూఢిల్లీ : నరేంద్రమోదీ-అమిత్ షా ద్వయం గురువులను ఎలా గౌరవిస్తున్నారో అద్వానీ, జోషిలకు టికెట్ ఇవ్వకపోవడంతో తేలిపోయిందిన విపక్ష కాంగ్రెస్ దాడికి దిగడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్, ఇతర విపక్షాలు టార్గెట్ చేయడంతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఇదే అంశంతో ఎన్నికల్లో విపక్షాలు లబ్ధిపొందుతాయోనని భావించిన బీజేపీ చీఫ్ అమిత్ షా .. అద్వానీ, జోషిని ఇంటికెళ్లి సమావేశమయ్యారు.
మేనిఫెస్టోతోపాటు వెళ్లిన షా ..
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రచార పర్వంలో ముందుకెళ్లడంతో ... ప్రజలకు ఆకట్టుకునేందుకు ఇవాళ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో మోదీ, షా .. వారి కోటరి పాల్గొన్నారు. ఆ తర్వాత మేనిఫెస్టో కాపీ తీసుకొని అమిత్ షా .. అద్వానీ ఇంటికెళ్లారు. ప్రజలకు ఇచ్చే హామీలను వివరించి, మేనిఫెస్టో కాపీని అందజేశారు. వాస్తవానికి మేనిఫెస్టో విడుదల కంటే ముందే అద్వానీ, జోషిని షా కలువాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల మేనిఫెస్టో విడుదల చేశాక వెళ్లి కలవడం విమర్శలకు దారితీసింది.
ఏం జరిగిందంటే ..?
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వయస్సు 75 ఏళ్లకు మించకూడదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అద్వానీ, జోషికు వివరించి నష్టనివారణ చర్యలు చేపట్టారు అమిత్ షా. బీజేపీ వ్యవస్థాపక సభ్యులు అద్వానీ, జోషికు టికెట్లు ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. మోదీ-షా వైఖరిపై అగ్రనేతలు కూడా గుర్రుమీద ఉన్నారు.
ఇదేనా మీరిచ్చే గౌరవం ?
బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తర్వాత తమను అమిత్ షా కలిసి విషయం చెప్పి ఉంటే బాగుండేదని అద్వానీ, జోషి భావించారు. బీజేపీ కార్యదర్శి ద్వారా తాము బరిలోకి లేమనే అంశం తెలిసి మదనపడ్డామని పేర్కొన్నారు. చాన్నాళ్ల తర్వాత తన మనసులోని మాటను బ్లాగులో రాసుకొన్నారు అద్వానీ. బీజేపీలో ప్రజాస్వామ్య విలువుల గురించి ప్రస్తావించి మోదీ-షా ద్వయంపై పరోక్షంగా విమర్శలు చేశారు.