మద్దతుగా ఉండండి: బాబా రాందేవ్ను కలిసిన అమిత్ షా
న్యూఢిల్లీ: 2019 ఎన్నికల కోసం మద్దతు కూడగట్టుకునేందుకు భారతీయ జనతా పా ర్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం యోగా గురువు రాందేవ్ బాబాను కలిశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
'బీజేపీకి మద్దతివ్వాలని అడిగేందుకు బాబా రాందేవ్ కలిశాను. నేను చెప్పినదంతా చాలా సహనంతో విన్నారు. పార్టీ చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలను ఆయనకు అందజేశాను' అని అమిత్ షా మీడియాకు వెల్లడించారు. ఒకవేళ మేము బాబా రాందేవ్ మద్దతు పొందితే.. ఆయన కోట్లాది మంది అనుచరుల మద్దతు కూడా పొందగలుగుతామని, వారి వద్దకు సులువుగా చేరుకోగలుగుతామని అమిత్ షా తెలిపారు.
'మద్దతు కోసం సంప్రదించడం' పేరుతో అమిత్ షా ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అమిత్ షాతో పాటు ఇతర నేతలు గతంలో బీజేపీకి మద్దతిచ్చిన 50 మంది వ్యక్తులను కలిసి మాట్లాడడంతో పాటు వారికి రిపోర్టు కార్డు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అమిత్ షా ఇప్పటికే ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ దల్బీర్ సుహాగ్, రాజ్యాంగ నిపుణులు సుభాష్ కశ్యప్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్లను కలిశారు. 2014 ఎన్నికల్లో తమతో పాటు ఉన్న వారి ఆశీర్వచనాలు కావాలని కోరుతున్నామని అమిత్షా అన్నారు. తాము దాదాపు లక్ష మంది ప్రజలను కలుస్తామని, దాదాపు కోటి ఇళ్లకు వెళ్తామని తెలిపారు.