అమిత్ షా అను నేను.. బీజేపీ కింగ్ మేకర్ నుంచి కేంద్ర మంత్రిగా..!
ఢిల్లీ : రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత రాజ్నాథ్ సింగ్ ప్రమాణం చేశారు. మూడో స్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ ఆవరణలో కన్నుల పండువగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర మంత్రిగా ఈశ్వర్ కీ శపథ్ లేతా హు అంటూ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ సీనియర్ నేత అద్వానీ తదితరులు హాజరయ్యారు. పలువురు కేంద్ర మాజీ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు.
మోడీ, అమిత్ షా మార్క్.. బార్మేర్ ఎంపీ కైలాశ్ చౌదరికి మంత్రిగా ఛాన్స్
బీజేపీ కింగ్ మేకర్ స్థానం నుంచి అమిత్ షా మంత్రివర్గంలోకి రావడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మోడీ నేతృత్వంలో పార్టీని పటిష్ట పరుస్తూ ముందుకెళుతున్న అమిత్ షా తొలిసారిగా కేంద్ర మంత్రిగా సేవలు అందించనున్నారు. అయితే ఆయన మంత్రివర్గంలోకి వస్తారా లేదా అనే విషయంపై రెండు మూడు రోజులుగా తీవ్రస్థాయిలో జోరుగా చర్చ జరిగింది. చివరకు ఆయన మోడీ కేబినెట్ లో కొలువుదీరారు. అమిత్ షా మంత్రివర్గంలోకి రావడంతో నెక్ట్స్ బీజేపీ జాతీయాధ్యక్షుడు ఎవరనే చర్చ జరుగుతోంది. ఆయన వారసుడిగా జయ ప్రకాశ్ నడ్డా పార్టీకి సేవలందించే అవకాశం కనిపిస్తోంది.