ఇక దంచుడే.. ఆ గ్యాంగ్ని దండించే టైమొచ్చింది.. CAA హింసపై అమిత్ షా సీరియస్
దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న అల్లరిమూకలు(తుక్డే తుక్డే గ్యాంగ్) వల్లే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చెలరేగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పార్లమెంట్ లో ఒక్కమాట మాట్లాడని ప్రతిపక్ష పార్టీలు.. బిల్లు ఆమోదం తర్వాత మాత్రం అబద్దాలతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. అల్లరిమూకలతో కలిసి అపోజిషన్ పార్టీలు సాగించిన హింస వల్ల దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఢిల్లీ డెవెలప్మెంట్ అథారిటీ(డీడీఏ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఒక సభలో ఆయనీ కామెంట్లు చేశారు.
నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీనీ వదల్లేదు: టిక్ టాక్ వీడియోలో సెటైర్లు: జైలుపాలు..!
బుద్ధి చెప్పాల్సింది ప్రజలే..
సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చెలరేగడం ద్వారా ఎక్కువ నష్టపోయింది ఢిల్లీ ప్రజలేనని అమిత్ షా అన్నారు. సీఏఏ వల్ల భారత పౌరులకు ఎలాంటి నష్టం లేకున్నా.. ప్రతిపక్ష పార్టీలు కావాలని ప్రజల్లో లేనిపోని భయాలు కలగజేయడం వల్లే ప్రశాంతంగా ఉండే ఢిల్లీ నగరం అట్టుడికిపోయిందని చెప్పారు. ఆయా పార్టీలు, గ్యాంగుల ధ్వంసరచనకు ప్రతీకారం తీర్చుకునే టైమొచ్చిందని, వాళ్లకు ప్రజలే బుద్ధిచెప్పాలని షా అన్నారు.
కేజ్రీవాల్ గొప్పపనిమంతుడంటూ సెటైర్లు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో గెలవబోయేది బీజేపీనే అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో కేంద్రం చేసిన పనులన్నింటినీ సీఎం కేజ్రీవాల్ తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘ప్రధాని మోడీ కర్రపట్టుకునిమరీ మాతో పనులు వేగంగా చేయిస్తారు. ఒక విషయంలో మాత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పనిమంతుడని ఒప్పుకోవాలి. కేంద్రం చేసిన పనుల తాలూకు శిలాఫలకాల్లో తన పేరు అతికించుకోవడం ద్వారా కేజ్రీవాల్ జనంలో క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాడు. ఈసారి ఆయన పప్పులు ఉడకవు''అని షా అన్నారు. ప్రధాని మోదీ కూడా ఆదివారంనాటి ‘రాంలీలా' మీటింగ్ లో కేజ్రీవాల్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఢిల్లీ ప్రజల్ని కేజ్రీవాల్ మోసం చేశారని మోదీ విమర్శించారు.
ఏడు రోజుల్లోపే ఎన్నికల షెడ్యూల్?
మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరితో గడువు ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు చేస్తున్నది. జనవరి ఐదు లోపే పోల్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ఢిల్లీలోని అనధికార కాలనీలను రెగ్యులరైజ్ చేసిన కేంద్రం.. షెడ్యూల్ విడుదలకు ముందే మరిన్ని వరాలు ప్రకటించే అవకాశముంది.