బీజేపీ సంచలనం: నేపాల్, శ్రీలంకలో ప్రభుత్వ ఏర్పాటుకు అమిత్ షా భారీ ప్లాన్ -త్రిపుర సీఎంకు పార్టీ సమర్థన
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా కొనసాగుతోన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తన బేస్ను విదేశాలకు కూడా విస్తరించాలనుకుంటోందా? ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాల్లో ఒకటైన 'అఖండ భారత్'కలను తిరిగి సాకారం చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోందా? భారత్ లో బీజేపీని తిరుగులేని శక్తిగా నిలబెట్టిన అమిత్ షా.. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ కాషాయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ సంచలన కామెంట్లు, వాటికి పార్టీ అధికారిక సమర్థన.. 'బీజేపీ గ్లోబల్ గోల్' ను మరింతగా రూఢీ చేశాయి..
Recommended Video
వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనం
నేపాల్, శ్రీలంకలో బీజేపీ సర్కార్
'మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది..' 'నిర్మాణరంగంలో అనుభవం కలిగిన సివిల్ ఇంజనీర్లకు మాత్రమే దేశ నిర్మాణానికి పనికొస్తారు..', 'పాల ధర లీటరుకు రూ.50 అయింది కాబట్టి, నిరుద్యోగులంతా ఒక్కో బర్రెను సాకితే ఐదేళ్లలో లక్షాధికారులు అయిపోతారు..'.. అంటూ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో త్రిపుర బీజేపీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ గతంలో ఎన్నోసార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన సొంత పార్టీ విస్తరణ గురించి అనూహ్య కామెంట్లతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. రాష్ట్ర రాజధాని అగర్తలాలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివాంర జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారత్ తోపాటు పొరుగుదేశాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం బీజేపీ లక్ష్యమని, నేపాల్, శ్రీలంకలో బీజేపీ సర్కారు ఏర్పాటయ్యేలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రణాళికలు రచిస్తున్నారని త్రిపుర సీఎం తెలిపారు. ఇది..
తొలి టార్గెట్ పూర్తయిన వెంటనే..
భారత్లోని అన్ని రాష్ట్రాల్లోనూ విజయం దక్కించుకున్నాక విదేశాల్లోనూ గెలవాలని అమిత్ షా యోచిస్తున్నట్లు త్రిపుర సీఎం బిప్లబ్ తెలిపారు. అమిత్ షా త్రిపుర పర్యటన సందర్భంగా స్టేట్ గెస్ట్హౌస్లో తామీ విషయాలను మాట్లాడుకున్నామని సీఎం ఉద్ఘాటించారు. ''ఆ మీటింగ్ లో అజయ్ జామ్వాలా (బీజేపీ నార్త్ ఈస్ట్ జోనల్ సెక్రటరీ) మాట్లాడుతూ బీజేపీ చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వెంటనే అమిత్ షా... ఇప్పుడు శ్రీలంక, నేపాల్ ఇంకా మిగిలివున్నాయన్నాయని, నేపాల్, శ్రీలంకలలో పార్టీని విస్తరించాలని, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు'' అని బిప్లబ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టులకేనా?
భారత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న పార్టీలు అంతర్జాతీయంగా తమ కలాపాలను విస్తరించడం కొత్తేమీ కాదని, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఇతర దేశాల్లోనూ వ్యాపించి ఉన్నాయని గుర్తుచేస్తూ.. బీజేపీ కూడా అదే తరహాలో నేపాల్, శ్రీలంకలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని త్రిపుర సీఎం బిప్లబ్ అన్నారు. అయితే, ముందుగా భారత్ లోని అన్ని రాష్ట్రాలను బీజేపీ గెలవాల్సి ఉందని, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ, వెస్ట్ బెంగాల్ లోనూ బీజేపీ విజయం సాధించడం ద్వారా సదరు లక్ష్యానికి మరింత చేరువ అవుతామని ఆయన వివరించారు. కాగా,
పొరుగు దేశాల సార్వభౌమత్వం పట్టదా?
నేపాల్, శ్రీలంకలోనూ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేలా అమిత్ షా ప్లాన్ గీశారని త్రిపుర సీఎం బిప్లబ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. త్రిపుర సీఎం చెప్పిందే నిజమైతే, భారత హోం మంత్రిగా అమిత్ షా చేస్తున్నది అంతర్జాతీయ కుట్ర కిందికే వస్తుందని లెఫ్ట్ పార్టీ నేతలు ఆరోపించారు. బిప్లబ్ వ్యాఖ్యల్ని తేలికగా కొట్టిపారేయకుండా, బీజేపీ హైకమాండ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్రిపుర పీసీసీ ఉపాధ్యక్షుడు తపస్ డే మరో అడుగు ముందుకేసి.. బీజేపీ.. నేపాల్, శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటుండటం ఆ దేశాల సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్లేనని, బీజేపీకి ఇలాంటి వ్యవహారాలు తగవని మండిపడ్డారు. కానీ..
బీజేపీ లక్ష్యం అఖండ భారత్..
త్రిపురం సీఎం వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగిన దరిమిలా బీజేపీ ఆయనను సమర్థిస్తూ కీలక ప్రకటన చేసింది. తిపుర బీజేపీ అధికార ప్రతినిధి నాబేందు భట్టాచార్య ఈ మేరకు సోమవారం మీడియాకు సుదీర్ఘమైన క్లారిటీ ఇచ్చారు. బీజేపీ భావజాలాన్ని ప్రపంచ దేశాలకు విస్తరించే పని ఎప్పటి నుంచో కొనసాగుతోందని, నేపాల్ కాంగ్రెస్ పార్టీ, నేపాల్ కమ్యూనిస్టు పార్టీల రూపంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఇప్పటికే ప్రపంచ ఉనికి ఉందని, అలాంటప్పుడు బీజేపీ మాత్రం ఇతర దేశాలకు విస్తరించాలనుకోవడంలో తప్పేముందని భట్టాచార్య ప్రశ్నించారు. అఖండ భారత్ సాధన దిశగా, పొరుగు దేశాల్లో బీజేపీ భావజాలాన్ని వ్యాప్తి చేయడమనేది పార్టీ ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటని, ఎంతో గొప్పవైన భాతర సంస్కృతీ సంప్రదాయాలు విస్తరించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే, ప్రస్తుతానికి తమ లక్ష్యం ఇతర దేశాల్లోని ప్రజలను గెలుచుకోవడమేగానీ, వెంటనే అధికారాన్ని చెప్పడం మాత్రం కాబోదని భట్టాచార్య వివరించారు.
కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు -ఇంటి పైకప్పు తొలగించి బీభత్సం -8రోజుల పసికందు మృతి