ఢిల్లీ అల్లర్లు పెద్ద కుట్ర: అమిత్ షా.. సోనియా ప్రసంగమే కారణమన్న బీజేపీ.. కోర్టులపైనా విమర్శలు
దేశ రాజధానిలో ఇటీవల జరిగిన అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందని, అదేంటో కనిపెట్టేందుకు సమగ్రంగా దర్యాప్తు చేయిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటుకు తెలిపారు. ఢిల్లీ అల్లర్లపై బుధవారం లోక్ సభలో చర్చకు ఆయన ప్రభుత్వం తరఫున సమాధానమిస్తూ.. అల్లర్లు దురదృష్టకరమని, మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. సున్నితమైన అంశం కాబట్టే హోలీ పండుగ తర్వాత చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దుదృష్టవశాత్తూ దీన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేశాయని మండిపడ్డారు.
Recommended Video
ఢిల్లీ అల్లర్ల సమయంలో పోలీసుల పాత్రపై పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలను హోం మంత్రి షా తిప్పికొట్టారు. కేవలం 20 లక్షల మంది నివసించే (ఈశాన్య ఢిల్లీ) ప్రాంతంలోనే అల్లర్లు చెలరేగాయని, గొడవలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా.. 36 గంటల్లోనే వాటిని అదుపుచేసిన ఘనత పోలీసులదని, అందుకు వారిని ప్రశంసిస్తున్నానని, అల్లర్లపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని, కారకులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని షా తెలిపారు.
కాగా, ఢిల్లీ అల్లర్లలో మొత్తం 52 మంది భారతీయులు చనిపోయారని, 526 మంది భారతీయులు గాయపడ్డారన్న అమిత్ షా.. పరోక్షంగా సీఏఏ వ్యతిరేక నిరసనల్ని దేశవ్యతిరేక చర్యగా అభివర్ణించారు. సీఏఏపై వ్యతిరేకత పేరుతో ముందుగా వీధుల్లో బాహాబాహీకి దిగింది ఎవరో దేశమంతా చూసిందని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీ అల్లర్లలో మొత్తం 371 దుకాణాలు, 142 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు.
అంతకుముందు లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ఢిల్లీ అల్లర్లపై చర్చను ప్రారంభిస్తూ.. హింసాకాండకు బీజేపీదే బాధ్యత వహించాలని, హొం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు దేశరాజధానిలో జనం పిట్టల్లా రాలిపోతుంటే.. ప్రధాని,కేంద్ర మంత్రులు మాత్రం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సేవలో మునిగితేలారని ఎద్దేవాచేశారు. పాకిస్తాన్ లోని బాలాకోట్ లోనే ఉగ్రవాదుల్ని నిర్మూలించామని చెప్పుకున్న మోదీ సర్కారు.. ఢిల్లీలో అల్లర్లను మాత్రం సకాలంలో ఎందుకు అదుపుచేయలేదో బదులు చెప్పాలన్నారు.
బీజేపీకి చెందిన ఎంపీ మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. అల్లర్లకు కారకులంటూ తమ పార్టీకి చెందిన అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మలను అనవసరంగా ఆడిపోసుకున్నారని, నిజానికి రాంలీలా మైదాన్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగంతోనే గొడవలకు బీజం పడిందని, ప్రతిపక్ష నేతల ప్రోద్బలంతోనే సంఘవిద్రోహ శక్తులు పేట్రేగిపోయాయని అన్నారు. కోర్టు చెప్పేదాకా ఢిల్లీ పోలీసులు కదలకుండా కూర్చుంటారని కొంత మంది జడ్జిలు భావించడం కరెక్ట్ కాదంటూ పరోక్షంగా జస్టిస్ మురళీధరన్ పై ఆమె మండిపడ్డారు. ఢిల్లీ అల్లర్లపై అమిత్ షా సమాధానం తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను శుక్రవారానికి వాయిదా వేశారు.