శుభవార్త చెప్పిన అమిత్ షా.. నాలుగు నెలల్లో ఫినిష్.. దమ్ముంటే ఆపాలంటూ ప్రతిపక్షాలకు సవాల్..
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి కేంద్ర హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా శుభవార్త చెప్పారు. ఆకాశాన్ని తాకేలా అద్భుతమైన రామాలయాన్ని నాలుగంటే నాలుగు నెలల్లోనే నిర్మించి తీరుతామన్నారు. దమ్ముంటే మందిర నిర్మాణాన్ని ఆపాలంటూ ప్రతిపక్ష పార్టీలకు సవాలు విసిరారు. ఆదివారం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో సీఏఏ అవగాహన సభలో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.
కళ్లుమిరుమిట్లు గొలిపేలా..
‘‘అయోధ్యలో రామాలయాన్ని కట్టనీయకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కపిల్ సిబాల్ అడ్డుపడాలని ప్రయత్నిస్తున్నారు. సిబాల్ సాబ్.. చెబుతున్నా వినుకోండి.. ట్రస్టు ఏర్పాటైన తర్వాత నాలుగంటే నాలుగు నెలల్లోనే కళ్లుమిరుమిట్లు గొలిపే రీతిలో అయోధ్యలో ఆలయాన్ని కడతాం. మీకు దమ్ముంటే ఆపండి చూద్దాం..''అని అమిత్ షా అన్నారు.
త్వరలోనే ట్రస్ట్..
అయోధ్యలో నాలుగు నెలల్లోపే మందిరాన్ని నిర్మిస్తామన్న అమిత్ షా.. నిర్మాణానికి సంబంధించిన ట్రస్టును అతి త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందల ఏళ్లపాటు కొనసాగిన అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు గతేడాది సంచలన తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.6 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని కోర్టు చెప్పడంతో రామాలయానికి మార్గం సుగమమైంది.
పాకిస్తాన్ భాషలో..
పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఏ ఒక్క భారతీయుడికీ అన్యాయం జరగబోదని, దీనిపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ చీఫ్ చెప్పారు. సీఏఏ విషయంలో అచ్చం పాకిస్తాన్ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాడిన భాషనే ఇక్కడి పార్టీలు మాట్లాడుతున్నాయని, వాళ్ల మధ్య ఉన్న సంబంధమేంటో అర్థం కావడంలేదని షా ఎద్దేవా చేశారు. దేశంలో సీఏఏ అమలును ఎవరూ అడ్డుకోలేరని, మూడు దేశాల్లో మత పీడను ఎదుర్కొన్న బాధితుల్ని ఆదుకొని తీరుతామని చెప్పారు. ఢిల్లీలోని జవహరల్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కొంత మంది యువతీయువకులు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని, దేశాన్ని ముక్కలు చేస్తామంటూ శపథాలు చేస్తున్నారని, అలాంటివాళ్లందరిపైనా దేశద్రోహం కేసులుపెట్టి జైళ్లలో పడేస్తామని కేంద్ర హోం మంత్రి హెచ్చరించారు.