అగ్గిరాజేసిన అమిత్ షా ఒకే భాష కామెంట్స్.. ఒంటికాలిపై లేచిన స్టాలిన్, కుమారస్వామి
న్యూఢిల్లీ : ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఒకే భాష పేరుతో జాతీయ భాష హిందీని ప్రమోట్ చేయాలని కోరారు. దీంతో అంతర్జాతీయంగా కూడా దేశానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. హిందీ దివాస్ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిలో చిచ్చురేపాయి. దీంతో జేడీఎస్ అధినేత, మాజీ కర్ణాటక సీఎం కుమారస్వామి, డీఎంకే చీఫ్ స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమిత్ షా కామెంట్లపై ఒంటికాలితో లేచారు.
దేశవ్యాప్తంగా హిందీని ప్రమోట్ చేయాలన్న వ్యాఖ్యలను తప్పుపట్టారు డీఎంకే చీఫ్ స్టాలిన్. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము దీనిని నిరసిస్తూ ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఒకే భాష అమల్లో ఉండాలని పిలుపునివ్వడం ఏంటి అని ప్రశ్నించారు. హిందీ జాతీయ భాష .. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో హిందీని మాట్లాడతారు. మరీ ఇంకా ప్రమోట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. తమిళుల కోసమే డీఎంకే ఆవిర్భవించందని .. వారి హక్కుల కోసమే పోరాడుతుందని స్పస్టంచేశారు. ఈ అంశంపై ప్రధాని మోడీ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదీ దేశాన్ని విభజించడమే అవుతుందని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం తాము ఎప్పటికీ పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు.
Recommended Video
మరోవైపు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి స్పందిస్తూ .. హిందీతోపాటు మిగతా భాషలను కూడా గౌరవించాల్సిన పరిస్థితి ఉందన్నారు. కన్నడ దివాస్ రోజున ప్రధాని మోడీ పాల్గొంటారు కదా .. అని ప్రశ్నార్థకంగా అడిగారు. ప్రతి ఒక్కరికీ తమ భాషపై అభిమానం ఉంటుందని .. కానీ ఒక భాషను మాట్లాడాలని, ప్రమోట్ చేయాలని కోరడం తగదన్నారు.