కరోనా నుంచి కోలుకున్న అమిత్షా- త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్న ఎయిమ్స్....
కరోనా బారిన పడి చికిత్స పొందిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్షా కోలుకున్నారు. అలసట, ఒళ్లు నొప్పులతో ఎయిమ్స్లో చేరిన అమిత్ షా ప్రస్తుతం కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన్ను రేపో మాపో డిశ్చార్జ్ చేసే అవకాశముంది.
ఆగస్టు 2న కరోనా పాజిటివ్గా తేలడంతో ఢిల్లీ మేదాంత ఆస్పత్రిలో చేరినట్లు అమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు. అయితే ఆ తర్వాత ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో బీజేపీ వర్గాలు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆగస్టు 18న మరోసారి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి ఎయిమ్స్ లో చేరడంతో అమిత్షా ఆరోగ్యంపై వదంతులు షికార్లు చేశాయి.
తాజాగా కరోనా తర్వాత అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అమిత్షా ఆరోగ్యంగానే ఉన్నట్లు ఎయిమ్స్ ప్రకటన బట్టి అర్దమవుతోంది. దీంతో ఆయన్ను ఏ క్షణాన్నయినా డిశ్చార్జ్ చేయొచ్చని తెలుస్తోంది. వీఐపీ కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే అమిత్షాను డిశ్చార్జ్ చేసేందుకు ఎయిమ్స్ వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.