అటల్ బిహారీ వాజపేయి నివాసంలోకి అమిత్ షా
Recommended Video
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా మంగళవారం ఢిల్లీలోని 6ఏ, కృష్ణన్ మీనన్ మార్గ్లో ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నివసించిన బంగ్లాలోకి మారారు. ఇప్పటి వరకు 11, అక్బర్ రోడ్డులోని బంగ్లాలో ఉండేవారు అమిత్ షా. ఇప్పుడు ఆ బంగ్లాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కేటాయించారు.
బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం, అమిత్ షా కేంద్రమంత్రివర్గంలో చేరడంతో ఇప్పుడు వాజపేయి బంగ్లాను అమిత్ షాకు కేటాయించారు. ఆగస్టు 15న గృహ ప్రవేశ వేడుకను నిర్వహించారు. గత సంవత్సరం మాజీ ప్రధాని మరణంతో ఆ బంగ్లా ఖాళీగా ఉంటోంది.
జూన్లో వాజపేయి నివాసాన్ని పరిశీలించిన అమిత్ షా.. కొన్ని మార్పులు చేయించినట్లు సమాచారం. 2004 నుంచి సుమారు 14ఏళ్లపాటు వాజపేయి, ఆయన కుటుంబసభ్యులు ఇక్కడే నివాసం ఉన్నారు.
కాగా, మాజీ ఎంపీలందరూ ప్రభుత్వం కేటాయించిన నివాసాలను ఖాళీ చేయాలని కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యంగా లుటిన్స్ జోన్ లోని వారసత్వ బంగ్లాలున్నాయి. అయితే, నిబంధనల ప్రకారం.. లోక్ సభ రద్దైన నెల రోజుల లోపు ఎంపీలు వారికి కేటాయించిన నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.
కాలపరిమితికి మంచి ప్రభుత్వం కేటాయించిన నివాసాల్లో ఉంటున్న ఎంపీలు ఆ బంగ్లాలను ఏడు రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. అంతేగాక, మూడు రోజుల్లోనే విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసింది. దీంతో సదరు ఎంపీలు బంగ్లాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.