అమిత్ షాదే బాధ్యత, అధ్యక్షుడిగా శివరాజ్, మోడీ మేజిక్ పని చేయదు: బీజేపీ నేత షాకింగ్
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బాధ్యత వహించాలని ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి సంఘ్ ప్రియ గౌతమ్ అన్నారు. అలాగే, వచ్చే లోకసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మేజిక్ పని చేయలేదని చెప్పారు.
వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరాలంటే పలువురు నాయకులను ఆయా పదవుల నుంచి తప్పించి, ఇతరులను వారి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా సూచించారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు.
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీదేదే పైచేయి, కానీ
అమిత్ షా స్థానంలో శివరాజ్ సింగ్
బీజేపీ జాతీయ అధ్యక్షులుగా అమిత్ షాను తొలగించి, ఆయన స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ను నియమించాలని సూచించారు. అలాగే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఉప ప్రధానమంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ను తొలగించి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్కు ఆ బాధ్యతలు అప్పగించాలని చెప్పారు.
మోడీ మంత్ర పని చేయదు
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓడిపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. కానీ ఎవరికీ మెజార్టీ రాలేదు. దీంతో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై సదరు బీజేపీ నేత గౌతమ్ మాట్లాడుతూ.. ఈ ఓటమికి మోడీ, అమిత్ షాలు బాధ్యత వహించాలన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో మోడీ మంత్రం, అమిత్ షా చాణక్యం పని చేయదన్నారు. బీజేపీ ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లలో అధికారం కోల్పోయిందన్నారు.
మళ్లీ గెలుపు అనివార్యం
2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలవడం, నరేంద్ర మోడీ మరలా ప్రధాని కావడం అనివార్యమని గౌతమ్ చెప్పారు. అలా జరగాలంటే పలు మార్పులు, చేర్పులు జరగాలని సూచించారు. కాగా, గౌతమ్ రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో కేంద్రమంత్రిగా ఉన్నారు.