లాక్డౌన్ 5.0: సీఎంల అభిప్రాయం తీసుకున్న హోంమంత్రి అమిత్ షా, మన్ కీ బాత్లో...
దేశంలో లాక్డౌన్ 4.0 మరో మూడురోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో 5.0 లాక్డౌన్ గురించి ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకున్నారు హోంశాఖ మంత్రి అమిత్ షా. మే 31వ తేదీ తర్వాత లాక్ డౌన్ కంటిన్యూ చేద్దామా..? లేదంటే ఎత్తివేద్దామా అనే అంశాలపై సీఎంలను అడిగినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్పై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అమిత్ షాతో సీఎంలు చర్చించారు.
కరోనా వైరస్ గురించి క్యాబినెట్ కార్యదర్శి సమక్షంలో అమిత్ షా, సీఎంలతో మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం అభిప్రాయం తీసుకున్నారు తప్ప.. ఇందులో రాజకీయాలకు తావులేదని స్పష్టంచేశారు. అయితే వైరస్ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై విపక్ష కాంగ్రెస్, కొందరు సీఎంలు విమర్శిస్తోన్న నేపథ్యంలో.. సీఎంలతో అమిత్ షా మాట్లాడారు.
కరోనా వైరస్ అనేది జాతీయ విపత్తు.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఏకీభవించొచ్చు, లేదంటే సొంతం డిసిషన్ తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. లాక్ డౌన్ 4.0లో భారీగా సడలింపులు ఇచ్చారు. రవాణాకు కూడా అవకాశం ఇవ్వడంతో.. కొన్ని రాష్ట్రాల్లో అంతరాష్ట్ర సర్వీసులు కూడా నడుస్తున్నాయి.
సీఎంల అభిప్రాయం తీసుకున్న అమిత్ షా.. కేంద్రానికి నివేదిస్తారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి.. లాక్ డౌన్ 5.0పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆదివారం రోజున ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడతారు. ఆ సమయంలో లాక్ డౌన్ 5.0 గురించి చెప్పే అవకాశం ఉంది. లాక్ డౌన్ కొనసాగుతోందా..? ఎత్తివేస్తారా..? మరిన్ని సడలింపులు ఇస్తారనే అంశంపై అప్పుడే స్పష్టత వస్తోంది.