హర్యానాలో హంగ్: రంగంలో ట్రబుల్ షూటర్ అమిత్ షా..ఐటీబీపీ ఈవెంట్ రద్దు: ఖట్టర్ కు హస్తిన పిలుపు
న్యూఢిల్లీ: హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పరిస్థితుల్లో భారతీయ జనతాపార్టీ సుప్రిమో, ట్రబుల్ షూటర్ గా పేరున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. అత్యంత కీలకమైన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. దేశ రాజధానిలో మకాం వేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం హర్యానాలో ఏర్పడిన రాజకీయ పరిణామాలను ఆయన అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పార్టీ నాయకుల నుంచి క్షేత్రస్థాయి నివేదికలను తెప్పించుకుంటున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది.
గెలిచి తీరుతామని భావించి.. మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా..
హర్యానా ఎన్నికల్లో గెలిచి తీరుతామని తీర్మానించుకుంది బీజేపీ. దీనికి అనుగుణంగానే ఏర్పాట్లను పూర్తి చేసింది. మహారాష్ట్రతో పాటు హర్యానాలోనూ తాము వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటామని ఆత్మ విశ్వాసంతో కనిపించింది. అది కాస్తా అతి విశ్వాసంగా పరిణమించింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడటం, అధికారాన్ని అందుకోవడానికి 11 సీట్ల దూరంలో నిలిచిపోవడం బీజేపీ అధిష్ఠానానికి మింగుడు పడట్లేదు. తాము తక్కువగా అంచనా వేసిన జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ) కింగ్ మేకర్ లా అవతరించడంతో ఖంగు తిన్నారు కమల నాథులు. దీనితో అప్పటికప్పుడు నష్ట నివారణ చర్యలకు దిగారు.
హస్తినలో శరవేగంగా మారుతున్న పరిణామాలు
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన ప్రభావం హస్తినపై పడింది. దేశ రాజధానిలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఐటీబీపీ కార్యక్రమానికి వెళ్లాల్సిన అమిత్ షా తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఢిల్లీకి రావాలని ఆదేశించారు. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఖట్టర్.. అమిత్ షా భేటీ కానున్నారు. గెలిచి తీరుతామని భావించిన రాష్ట్రాన్ని చేజేతులా పోగొట్టుకున్నామనే ఆగ్రహం అమిత్ షాలో వ్యక్తమౌతోంది. టికెట్ల పంపకాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, దాని ఫలితంగానే అధికారాన్ని కోల్పోయే స్థితికి చేరుకోవాల్సి వచ్చిందని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
నష్ట నివారణ చర్యల్లో భాగంగా.. దుష్యంత్ కు ముఖ్యమంత్రి పదవి?
హర్యానాలో అనూహ్యంగా ఎదురైన వ్యతిరేక ఫలితాల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం నష్ట నివారణ చర్యలను చేపట్టింది. కింగ్ మేకర్ లా ఆవిర్భవించిన జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలాకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై చర్చలు కొనసాగిస్తోంది. ఈ అంశంపై చర్చించడానికి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఢిల్లీకి పిలిపించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం ఖాయమైన నేపథ్యంలో.. మున్ముందు ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుందనే అంశంపై అమిత్ షా దృష్టి సారించారు. కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలకైనా చేపట్టడానికి బీజేపీ అగ్ర నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవంక- దుష్యంత్ చౌతాలా మద్దతు ఇస్తే.. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి కాంగ్రెస్ సన్నద్ధమైంది.