బీజేపీ ప్రెసిడెంట్గా మళ్లీ అమిత్ షా? కారణం అదేనా?
Recommended Video
ఢిల్లీ : బీజేపీ కొత్త అధ్యక్షుని నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోడీ 2.0 కేబినెట్లో అమిత్ షా హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న అంశంపై కొన్నాళ్లుగా సస్పెన్స్ కొనసాగుతోంది. వాస్తవానికి 2018 డిసెంబర్లో పార్టీ జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా పదవీకాలం ముగిసినా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయనను మరి కొంతకాలం పార్టీ ప్రెసడెంట్గా కొనసాగించారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినందున నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభంకానుంది.
బీజేపీ చీఫ్ ఎవరు ? మరికొన్ని గంటల్లో వీడనున్న ఉత్కంఠ .. రేపు బీజేపీ ఆఫీస్ బేరర్ల భేటీ
కీలక సమావేశం
బీజేపీ కొత్త అధ్యక్షున్ని ఎన్నికకు సంబంధించి గురువారం బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జనరల్ సెక్రటరీతో అమిత్ షా భేటీ కానున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలపై వారితో చర్చించనున్నారు. అధ్యక్ష ఎన్నిక పోలింగ్ తేదీలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలు భేటీలో ప్రస్తావనకు రానున్నారు.
అమిత్ షా వైపే మొగ్గు
సార్వత్రిక ఎన్నికల్లో 300లకుపైగా సీట్లతో బీజేపీ ప్రభంజనం సృష్టించడానికి అమిత్ షా రాజకీయ వ్యూహాలే కారణమన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మరికొంతకాలం పాటు అమిత్ షా కే జాతీయాధ్యక్ష పగ్గాలు అప్పజెప్పాలని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాది చివరలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మరో మూడేళ్లు ఆయనకే పగ్గాలు
సార్వత్రిక ఎన్నికల సమయంలో షా పన్నిన వ్యూహాలు బీజేపీకి తిరిగి అధికారం కట్టబెట్టాయి. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో మరింత పుంజుకోవడం, ప్రతిపక్షాలు బలంగా ఉన్న చోట్ల పార్టీ పునాదుల్ని మరింత ధృడం చేయడమే లక్ష్యంగా షా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే బెంగాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు అమిత్ షా చేతిలో ఉంటేనే అక్కడ పాగా వేయగలమని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలో ఆయనను మరో మూడేళ్ల పాటు పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గురువారం సమావేశం అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.