ఇదేనా విద్యా విప్లవం: ఢిల్లీ స్కూలు వీడియోను పోస్టు చేసిన అమిత్ షా.. కేజ్రీపై విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో హీట్ కనిపిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా నాయకుల మధ్య కనిపిస్తున్నాయి. గతవారం ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల మధ్య సవాల్ ప్రతి సవాళ్లు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని అమిత్ షా చెప్పగా... అనవసర విషయాలపై దృష్టి సారించడం మానేసి కొంత సమయం తీసుకుని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అమిత్ షాను కోరారు.
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమిత్ షా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ విద్యా విప్లవం తీసుకొచ్చిందని చెబుతోందని కానీ తమ బీజేపీ ఎంపీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారని పరిస్థితి అద్వానంగా ఉందని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని కేజ్రీవాల్ అన్నారని నిన్న బీజేపీకి చెందిన 8మంది ఎంపీలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారని అమిత్ షా ట్విటర్లో పేర్కొన్నారు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని అమిత్ షా చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
अरविंद केजरीवाल जी आपने मुझे दिल्ली सरकार द्वारा संचालित स्कूल देखने के लिए बुलाया था। कल दिल्ली भाजपा के आठों सांसद अलग-अलग स्कूल में गए और देखिए इनका क्या हाल है...
— Amit Shah (@AmitShah) January 28, 2020
इनकी बदहाली ने आपकी ‘शिक्षा की क्रांति’ के दावों की पोल खोल दी।
अब आपको दिल्ली की जनता को जवाब देना होगा... pic.twitter.com/gjzgaix2rA
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను ఎంపీలు డాక్టర్ హర్ష వర్ధన్, విజయ్ గోయల్, పర్వేష్ సింగ్, మీనాక్షి లేఖి, గౌతం గంభీర్, హన్స్రాజ్ హన్స్, మనోజ్ తివారీ, రమేష్ బిధురీలు సందర్శించారు. ఆ స్కూళ్లల్లో టీచర్ల కొరత, విద్యార్థులకు నీటి సదుపాయం, మరుగుదొడ్లు లేవని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు వరల్డ్ క్లాస్గా ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పడంపై వాస్తవాలు తెలుసుకునేందుకు పర్వేష్ సాహిబ్ సింగ్ సోమవారం మాటియాలా నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. వర్మతో పాటు కొంతమంది జర్నలిస్టులను కూడా అక్కడికి తీసుకెళ్లారు. పాఠశాల భవంతి శిథిలావస్తలో ఉండగా గోడలు చీలి ఉన్నట్లు కనిపించాయి.
Pictures of Delhi govt. school in Ujwa village. This is what they have done in government schools.
— Parvesh Sahib Singh (@p_sahibsingh) January 27, 2020
Still waiting for @ArvindKejriwal to give me time and come with me to see govt schools in Delhi. pic.twitter.com/MnqppL7Lix
ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసిన వర్మ... ఉజ్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దుర్భరంగా ఉందని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పాఠశాలలను ఈ రకంగా నడుపుతోందని ట్వీట్ చేశారు. తనతో పాటు అరవింద్ కేజ్రీవాల్ వచ్చి కొంత సమయం తీసుకుని ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి స్కూలుకు వచ్చిన ఓ లేఖను కూడా ప్రస్తావించారు వర్మ. పాఠశాల పరిస్థితి దారుణంగా ఉందని ఏ క్షణమైనా కూలే అవకాశం ఉందని ఆ లేఖలో అధికారులు పేర్కొన్న విషయాన్ని పర్వేష్ సింగ్ వర్మ చూపించారు.