పులులు: ఒడిశా సర్కారుపై విమర్శలు, అమితాబ్ బచ్చన్ హ్యాపీ
భువనేశ్వర్/ముంబై: దేశంలో పులుల సంఖ్య పెరగడం పైన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సంతోషం వ్యక్తం చేశారు. అమితాబ్ సేవ్ ది టైగర్ క్యాంపెయిన్కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. 2010 నుండి అమితాబ్ ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఒడిశా సర్కారుపై విపక్షాల మండిపాటు
పులుల సంరక్షణ అంశంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో పులుల సంఖ్య తక్కువగా ఉండటంతో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఒడిశాలో పులుల సంఖ్య తక్కువగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమని ఆరోపిస్తున్నాయి.
కాగా, 2014వ సంవత్సరంనాటికి భారత్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. ఏడు సంవత్సరాల క్రితం 1,411గా ఉన్న పులుల సంఖ్య 2014నాటికి 2,226కు పెరిగిందని కేంద్ర పర్యావరణ శాక పేర్కొంది.
ప్రపంచంలోని 70 శాతం పులులు భారత్లోనే ఉన్నాయని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం ఓ నివేదికను విడుదల చేశారు. 2010 సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,706 పులులు ఉండగా 2006 లో 1,411 పులులున్నట్టు ఈ నివేదికలో పేర్కొంది.
దేశంలో ఉన్న పులుల సంఖ్యను అంచనా వేసే నివేదిక-2014 విడుదలపై పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్జవదేకర్ స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోతున్న సమయంలో దేశంలో పులుల సంఖ్య పెరగటం శుభపరిణామని అన్నారు.
406 పులులతో కర్ణాటక అన్ని రాష్ట్రాలకన్నా ముందజలో ఉందన్నారు. ఆ తర్వాత వరుసగా ఉత్తరాఖండ్లో 340, తమిళనాడులో 229, మధ్యప్రదేశ్ లో 208, మహారాష్ట్రలో 190, పశ్చిమ బెంగాల్లో 76 పులులు ఉన్నాయని తెలిపారు. 20వ శతాబ్ధం ప్రారంభంలో లక్షకు పైగా ఉన్న పులుల సంఖ్య వేటగాళ్లు వేటాడటంతో 2008లో 1411కు పడిపోయిందని చెప్పారు.