సూపర్ స్టార్ కు అత్యున్నత పురస్కారం.. ఆరోగ్యం కుదుటపడటంతో..
భారత చలనచిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. సినిమాలకు సంబంధించి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగిన వేడుకలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. అమితాబ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు.
ఆరోగ్యం కుదుటపడటంతో..
ఇండియన్ సినిమా రంగానికి అమితాబ్ అందించిన విశేష సేవలకు గౌరవంగా ఆయనకు ఫాల్కే పురస్కారం లభించింది. అవార్డు పత్రంతోపాటు స్వర్ణకమలం, రూ.10లక్షల నజరానానూ అమితాబ్ కు అందించారు. నిజానికి ఫాల్కే అవార్డు వేడుక ఈనెల 23నే జరగాల్సి ఉన్నా.. బిగ్ బి ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆదివారానికి వాయిదాపడింది.
బెస్ట్ మూమెంట్స్..
భారతీయ సినిమా రంగంలో నోబెల్ గా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, ఈ క్షణాలు తన జీవితంలో అత్యంత మధురమైనవని అమితాబ్ చెప్పారు. తనను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు థ్యాంక్స్ చెప్పారు. కార్యక్రమంలో ఆయన వెంట భార్య జయా బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నారు.
అభినందనల వెలులవ..
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించిన సందర్భంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు అభినందనలు వెల్లువెత్తాయి. కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తోపాటు పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు.