లవ్ పాకిస్తాన్! ప్రొఫైల్ పిక్లో పాక్ ప్రధాని! ట్వీట్ చేయబోయి..నోరెళ్లబెట్టిన అమితాబ్
ముంబై: భారత చలనచిత్ర పరిశ్రమ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్లో కొన్ని ఆశ్చర్యకరమైన పోస్టులు కనిపించాయి. లవ్ పాకిస్తాన్.. అంటూ ట్వీట్ చేశారు. అమితాబ్ ప్రొఫైల్ పిక్ కూడా తొలగించారు. దాని స్థానంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటోను ఉంచారు. ఓ రాబందు పిక్ను కవర్ ఫొటోగా అమర్చారు. తన ట్విట్టర్ అకౌంట్లో చోటు చేసుకున్న మార్పులను చూసి.. చివరికి అమితాబ్ కూడా నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. దీనికంతటికీ కారణం.. ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్కు గురి కావడమే.
టర్కీకి చెందిన హ్యాకర్ గ్రూప్ ఒకటి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేసింది. ఈ గ్రూప్ సభ్యుడిగా ఉన్న అయిల్డిజ్ టిమ్ అనే యువకుడు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఆయన ఖాతాలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటోను పెట్టాడు. అమితాబ్ వ్యక్తిగత వివరాలను కూడా మార్చేశాడు. దాని స్థానంలో 'లవ్ పాకిస్థాన్' అని రాశాడు. టర్కీష్ జెండా ఎమోజీని ఉంచాడు. ఈ విషయం తన దృష్టికి రాగానే.. అమితాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తామే సైబర్ ఎటాక్ చేసినట్లు టర్కిష్ హ్యాకర్స్ గ్రూప్ ప్రకటించింది కూడా. తమ దేశానికి చెందిన ఫుట్బాల్ ఆటగాళ్ల పట్ల ఐస్ల్యాండ్ రిపబ్లిక్ ప్రవర్తించిన తీరును తాము ఖండిస్తున్నామని, దీనికి వ్యతిరేకంగా తాము ఈ సైబర్ ఎటాక్ చేస్తున్నామని అయిల్దిజ్ ప్రకటించుకున్నాడు. మనదేశంలో నివసించే ముస్లింలను ఉద్దేశించి కొన్ని పోస్టులు పెట్టాడు.