కరోనా లాక్డౌన్: లక్ష మందికి అమితాబ్ సాయం.. సినీ కార్మికులకు నెల రేషన్.. స్పాన్సర్లు ఎవరంటే..
సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన ఇమేజ్ లాగే మనసు కూడా పెద్దదేని నిరూపించుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నవేళ సినిమా పరిశ్రమ కూడా స్తంభించడంతో రోజుకూలీలు ఇబ్బందులపాలయ్యారు. దీంతో 1లక్ష మందికి నెల రోజులకు సరిపడా రేషన్ సరుకులు అందించేందుకు అమితాబ్ ముందుకొచ్చారు.
'WE ARE ONE' పేరుతో తలపెట్టిన ఈ కార్యక్రమం కింద.. ప్రాంతీయ బేధాలు లేకుండా అన్ని భాషల సినీరంగాల్లో పనిచేస్తున్న రోజు కూలీలకు సరుకులు అందజేస్తారు. అమితాబ్ చేపట్టిన ఈ మంచిపనికి సోని పిక్చర్స్ నెట్ వర్క్, కల్యాణ్ జువెలర్స్ స్పాన్సర్లుగా వ్యవహరించనున్నారు. ఆలిండియా ఫిలిం ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ కిందికొచ్చే కార్మికుల్లో అతిపేదలైన లక్ష మందికి అమితాబ్ సాయం చేస్తారని, ఇందులో తాము కూడా భాగ్వాములమైనందుకు సంతోషంగా ఉందని సోనీ ఇండియా, కల్యాణ్ జువెలర్ సంస్థలు పేర్కొన్నాయి.
ఇండియాలో ఆదివారం రాత్రి వరకు మొత్తం 4122 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 117 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 748 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 252, తెలంగాణలో 272 మందికి వైరస్ సోకింది.