అజిత్ దోవల్, ఐబీ అధికారులతో అమిత్ షా అత్యవసర భేటీ.. బాంబ్ పేలుడుతో..
ఢిల్లీలో బాంబ్ పేలుడుతో యావత్ జాతి ఉలిక్కిపడింది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కార్యాయాల్లో భద్రతను పెంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించుకుంది. మరోవైపు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, ఐబీ అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద సంభవించిన పేలుడు గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమిత్షాకు వివరించారు. దోవల్తో పాటు ఐబీ చీఫ్, ఢిల్లీ పోలీసు కమిషనర్ కూడా జరిగిన దాని ఘటన గురించి అమిషాకు ఎక్స్ ప్లేన్ చేశారు. అయితే ఇజ్రాయెల్ ఎంబసీకి కూతవేటు దూరంలో పేలుడు జరిగింది. ఘటన స్థలంలో ఒక ఎన్విలాప్ లభించగా.. దానిని సత్యశోధన చేస్తున్నారు. అయితే పేలుడు జరిగిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో విజయ్ చౌక్ ఉంది. అక్కడ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ.. ఇతర నేతలు బీటింగ్ రీట్రింగ్ కోసం హాజరయ్యారు.
దాడి నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఎయిర్ పోర్టులలో కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఉత్తరాఖండ్, హరిద్దార్, ఉద్దమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, నైనిటాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇటు యూపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. ఇటు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన దాడి ఉగ్ర దాడి అని ఇజ్రాయెల్ అంటోంది.