అమ్మకు చెన్నైలో నిలువెత్తు విగ్రహం: జయలలిత జయంతి రోజు, పళని, పన్నీర్, క్యాడర్!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చెయ్యాలని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్ణయించారు. ఈనెల 24వ తేది జయలలిత జయంతి సందర్బంగా అదే రోజు చెన్నైలోని రాయ్ పేటలో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అమ్మ విగ్రహం ఆవిష్కరించాలని పళనిస్వామి, పన్నీర్ సెల్వం నిర్ణయించారు.
ఏడాది పూర్తి
తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జయలలితను పురచ్చి తలైవీగా అన్నాడీఎంకే వర్గాలు పిలుచుకుంటాయి. జయలలిత అందరినీ విడిచి అనంతలోకాలకు వెళ్లి ఏడాదికి పైగా అయ్యింది. అప్పటి నుంచి ప్రజలు ఆమ్మ జ్ఞాపకాలను తలచుకుంటున్నారు.
పోయెస్ గార్డెన్
పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం వేదనిలయాన్ని అమ్మ స్మారకభవనం చెయ్యాలని, మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి, పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో సహ అన్నాడీఎంకే వర్గాలు ఇప్పటికే నిర్ణయించాయి.
కోయంబత్తూరులో !
తమిళనాడు మంత్రి వేలుమణి ఇటీవల కోయంబత్తూరులో అన్నా, ఎంజీఆర్ విగ్రహాల వరుసలో జయలలిత నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి తన పలుకుబడి, సత్తా చాటుకున్నారు. ఆ సందర్బంలో చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అమ్మ విగ్రహం ఏర్పాటు చెయ్యాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఎంజీఆర్ పక్కనే అమ్మ
చెన్నైలోని రాయ్ పేటలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం ఆవరణంలో ఎంజీఆర్ నిలువెత్తు విగ్రహం, దాని పక్కన పార్టీ జెండా ఉంది. అన్నాడీఎంకే పార్టీ జెండాను అక్కడి నుంచి తొలగించారు. ఎంజీఆర్ విగ్రహం పక్కనే జయలలిత నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.
అమ్మ జయంతి రోజు !
జయలలిత జయంతి సందర్బంగా వేల సంఖ్యలో కార్యకర్తలు అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వెలుతున్నారు. ఆ సందర్బంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో జయలలిత నిలువెత్తు విగ్రహం ఆవిష్కరించాలని అన్నాడీఎంకే పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షుడు పన్నీర్ సెల్వం, ఉపాధ్యక్షుడు పళనిస్వామి నిర్ణయించారు.