హల్దీరాం యూనిట్లో అమ్మోనియా గ్యాస్ లీక్, ఒకరి మృతి.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
నోయిడాలోని హల్దీరాం భవన సముదాయంలో అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. ప్రమాదంలో ఒకరు చనిపోయారు. భవన సముదాయం నుంచి 300 మందిని జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది కాపాడారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది, స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా సమాచారం అందజేశారు.
ఒకరి మృతి
నోయిడా సెక్టార్ 65 వద్ద గల పక్కనే రెండు యూనిట్లు ఉన్నాయి. ఒక్కటి ఉత్పత్తి యూనిట్ కాగా, మరొకటి నిర్వహణ యూనిట్ ఉన్నాయి. నిర్వహణ యూనిట్లో నాలుగు కండెన్సర్లు ఉన్నాయి. అందులో గల ఒక వాల్వ్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. అక్కడ 22 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. గ్యాస్ లీకయిన వెంటనే వారిని అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సృహ కోల్పోయిన ఒకరిని ఆస్పత్రికి తీసుకెళ్లామని, కానీ ఫలితం లేకుంా పోయిందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అనిల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. 42 ఏళ్ల అమ్మోనియా ఆపరేటర్ సంజీవ్ కుమార్ చనిపోయారని తెలిపారు.
300 మంది పని
ఉత్పత్తి యూనిట్లో ప్రమాదం జరిగిన సమయంలో 300 మంది పనిచేస్తున్నారు. వారిని వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. 47 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికులు అందరినీ కాపాడారని, మద్యాహ్నం 3 గంటల వరకు పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు. అక్కడ పరిస్థితిని పోలీసులతోపాటు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
112కు కాల్
తమకు 112 ద్వారా ఫోన్ వచ్చిందని.. వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టామని వివరించారు. భవన సమీపంలో అమ్మోనియా గ్యాస్ ప్రభావం ఉండటంతో గాలిలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నీటిని చల్లామని పేర్కొన్నారు. అంతకుముందే అమ్మోనియా గ్యాస్ ప్రధాన పైప్ లైన్ ఆపివేశామని వివరించారు.
ప్రభావం ఇలా..?
అమ్మోనియా గ్యాస్ వల్ల కళ్లు ముక్కు, గొంతు, శ్వాసకోశాలపై వెంటనే ప్రభావం చూపిస్తోంది. కళ్లు పోయి, ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోవడానికి దారితీస్తోంది. శీతలీకరణ కోసం అమ్మోనియా గ్యాస్ వాడుతుంటారు. ఇంట్లో వాడే ఫ్రీజ్లో కూడా అమ్మోనియా గ్యాస్ ఉంటుంది. కానీ ఫ్యాక్టరీలో మాత్రం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ప్రమాదాలకు గురైన సమయంలో మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది.