భారత్కు ఆమ్నెస్టీ గుడ్బై- కేంద్రం వేధింపులతో సంచలన నిర్ణయం- అంతర్జాతీయంగా అప్రతిష్ట...
అంతర్జాతీయ మానవహక్కుల సంస్ధ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత్లో తన కార్యకలాపాలు నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తన సిబ్బందితో పాటు సామాగ్రిని విదేశాలకు తరలించబోతోంది. కొంతకాలంగా భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనను నియంత్రించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచిన ఆమ్నెస్టీపై బెదిరింపులు ఎక్కువయ్యాయి. అలాగే ఫెరా, మనీలాండరింగ్ చట్టాలఉల్లంఘన పేరుతో ఆమ్నెస్టీ ఖాతాలను స్తంభింపజేయాలని కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై దేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా సంచలన ప్రకటన చేసింది. ఆమ్నెస్టీ నిర్ణయం భారత్పై అంతర్జాతీయంగా ప్రభావం చూపే అవకాశముంది.
భారత్లో ఆమ్నెస్టీ కార్యకలాపాలు..
1966లో బీహార్లో తన కార్యకలాపాలు ప్రారంభించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఆ తర్వాత క్రమంగా విస్తరించింది. కొన్నేళ్లుగా బెంగళూరు కేంద్రంగా ఆమ్నెస్టీ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వాల చేతుల్లో వేధింపులకు గురవుతున్న వారిని ఆదుకోవడం, న్యాయసహాయం చేయడం, శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించడం ఆమ్నెస్టీ కార్యకలాపాల్లో భాగంగా వస్తోంది. భారత్లో అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య తగ్గించాలని, ముంబై సబర్బన్ రైళ్లలో మహిళలకు భద్రత కల్పించాలని ఆమ్నెస్టీ ఎన్నో ఉద్యమాలు నిర్వహించింది. 1984 సిక్కుల ఊచకోత ఘటనలో బాధితులకు ఆమ్నెస్టీ అండగా నిలిచింది. భారత్లో ఉరిశిక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది. అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్ల ఉరిశిక్షలకు వ్యతిరేకంగా ఆమ్నెస్టీ అలుపెరగని పోరు సాగించింది.
ఎన్డీయే హయాంలో వేధింపులు..
దశాబ్దాలుగా భారత్లో మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆమ్నెస్టీ విషయంలో గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత అసంతృప్తి ఉన్నా అంతిమంగా ఈ అంతర్జాతీయ సంస్ధకు పలు అంశాల్లో సహకారం అందించేవి. ముఖ్యంగా విపక్షంలో ఉన్న పార్టీలు ప్రభుత్వాలపై పోరాటం కోసం ఆమ్నెస్టీ సాయం కోరిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఆమ్నెస్టీ చేపట్టిన పోరుతో ఆమ్నెస్టీకి ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా ఢిల్లీ, జమ్మూ- కశ్మీర్లో జరిగిన అల్లర్లలో మానవ హక్కుల ఉల్లంఘన ఉందని, అమాయకులను పోలీసులు వేధిస్తున్నారంటూ వారికి మద్దతుగా ఆమ్నెస్టీ పోరాటం చేసింది. ఇది కేంద్రానికి నచ్చలేదు. ఆమ్నెస్టీ చర్యలతో ఇరుకునపడ్డ కేంద్ర ప్రభుత్వం తెరవెనుక వేధింపులు మొదలుపెట్టింది. ఆమ్నెస్టీకి అందుతున్న విదేశీ నిధులపై ఆరా తీయడం మొదలుపెట్టింది. ఫెరా, మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసింది. బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. బీజేపీకి సన్నిహితంగా ఉన్న కొందరు వ్యక్తులు ఆమ్నెస్టీ సిబ్బందిపై బెదిరింపులకు కూడా దిగారు. దీంతో ఇక చేసేది లేక భారత్కు గుడ్ బై చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేసింది.
భారత్ నుంచి వైదొలగాలని నిర్ణయం...
కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతున్న నేపథ్యంలో భారత్లో తమ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. సెప్టెంబర్ 10న తమ సంస్ధ ఖాతాలను ఫెరా, మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘన పేరుతో కేంద్రం స్తంభింపజేయడంతో తమ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు అమ్నెస్టీ పేర్కొంది. దీంతో తమ సిబ్బందిని వెనక్కి తీసుకువెళ్లిపోవడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని రకాలైన పరిశోధనలు, క్యాంపెయిన్లను నిలిపివేస్తున్నట్లు ఆమ్నెస్టీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఆమ్నెస్టీ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
వేధింపులు ఉద్దేశపూర్వకమేనన్న అమ్నెస్టీ...
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత్తో పాటు అంతర్జాతీయంగా అన్ని దేశాలకు వర్తించే నిబంధనలతోనే పనిచేస్తుందని, భారత్లో తాము చేసిన కృషికి ప్రతిఫలంగానే నిధులు సమకూర్చుకున్నట్లు ఆమ్నెస్టీ తెలిపింది. ఎనిమిదేళ్లలో లక్ష మంది భారతీయులు తమకు ఆర్ధికంగా సహకరించారని వెల్లడించింది. కానీ రెండేళ్లుగా తమపై సాగుతున్న అణచివేత, బ్యాంకు ఖాతాల సీజ్ మాత్రం యాక్సిడెంటల్ మాత్రం కాదని ఆమ్నెస్టీ తెలిపింది. ఈడీ సహా పలు సంస్దలు తమను నిరంతరం వేధిస్తున్నాయని, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్లో అల్లర్లు తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన అంటూ తాము చేస్తున్న పోరాటానికి ఇది ప్రతిఫలంగా మారిందని ఆమ్నెస్టీ ఆవేదన వ్యక్తం చేసింది. తమకు అందిన విరాళాలు ఫెరా చట్టంతో కానీ మనీలాండరింగ్తో కానీ సంబంధం లేనివని ఆమ్నెస్టీ తెలిపింది. తమకు చట్టబద్ధంగా అందిన నిధులను చట్టాల ఉల్లంఘనగా చూపుతున్నారని ఆమ్నెస్టీ ఆక్షేపించింది.