పంజాబ్ రైలు దుర్ఘటన: రావణుడి పాత్ర వేసిన వ్యక్తి ఇతరులను కాపాడి తను చనిపోయాడు
అమృత్ సర్ : పంజాబ్ అమృత్సర్లో శుక్రవారం రావన దహనం వీక్షిస్తున్న వారిపైకి రైలు దూసుకెళ్లడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. రావణ దహనం కంటే ముందు స్టేజీపై ఓ నాటకం వేయడం జరిగింది. అందులో రావణాసురుడి పాత్రను దల్బీర్ సింగ్ అనే వ్యక్తి పోషించాడు. నాటకం అయిపోయిన తర్వాత బహుమతి ప్రదానం సందర్భంగా అక్కడే వేచి ఉన్నాడు. ముందుగా రావణ దహనం కార్యక్రమం జరిగింది. అదే సమయంలో పట్టాలపై ఉన్న ప్రజలు కార్యక్రమాన్ని వీక్షిస్తుండగా వేగంగా రైలు వారిపైకి దూసుకొచ్చింది. ఇది గమనించిన దల్బీర్ సింగ్ వెంటనే పట్టాల దగ్గరకు పరుగులు తీసి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశాడు.
పట్టాల పై ఉన్న వారిని కాపాడుతున్న క్రమంలో దల్బీర్ సింగ్ కాలు కూడా చిక్కుకుందని రైలు అతన్ని కూడా వేగంగా లాక్కెల్లడంతో మృతి చెందాడని అతని సోదరుడు బల్బీర్ సింగ్ తెలిపాడు. దల్బీర్ సింగ్ మృతి కుటుంబ సభ్యులను షాక్కు గురిచేసిందన్నారు. దల్బీర్ సింగ్కు భార్య ఎనిమిది నెలల చిన్న పాప ఉన్నట్లు తెలిపారు. దల్బీర్ సింగ్ భార్యకు ఉద్యోగం కల్పించాలని ఆర్థిక సహాయం చేయాలని బల్బీర్ సింగ్ ప్రభుత్వాన్ని కోరాడు.
తన కొడుకు తమను వదిలి వెళ్లిపోయాడన్న నిజాన్ని దల్బీర్ సింగ్ తల్లి జీర్ణించుకోలేకుంది. జరిగిన ఘటనపై ప్రభుత్వం ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేసింది. ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉంటే జోదా పాఠక్ దగ్గరలోని చౌరా బజార్లో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 61 మంది మృతి చెందారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.