మేం ఇంకా మర్చిపోలేదు, క్షమాపణ చెప్పండి: రాష్ట్రపతికి విద్యార్థులు
లక్నో: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గతంలో చేసిన వ్యాఖ్యలపై అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్నాథ్ కోవింద్ తమకు క్షమాపణలు చెప్పాలని లేదా స్నాతకోత్సవానికి గైర్హాజరు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముస్లింలకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా గతంలో వ్యాఖ్యలు చేశారని వారు గుర్తు చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాత విశ్వవిద్యాలయంలోకి కోవింద్ ప్రవేశించాలని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (ఎఎంయు) విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సజ్జాద్ సుభాన్ డిమాండ్ చేశారు.
ఇంకా గుర్తున్నాయి...
గతంలో చేసిన వ్యాఖ్యలకు కోవింద్ క్షమాపణ చెప్పడమా, లేదంటే స్నాతకోత్సవానికి గైర్హాజరు కావడమా అనేది నిర్ణయించుకోవాలని, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రతి విద్యార్థికీ ఇంకా గుర్తున్నాయని సజ్జాద్ సుభాన్ అన్నారు. తమ మాటలు లెక్క చేయకుండా వస్తే జరిగే పరిణామాలకు కోవింద్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సజ్జాద్ అన్నారు.
రంగనాథ్ మిశ్రా సూచన ఇదీ..
2010లో రామ్నాథ్ కోవింద్ బిజెపి అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆ సమయంలో రంగనాథ్ మిశ్రా కమిషన్ సమాజంలో ఆర్థిక వెనకబడిన మతాలవారికి, భాషలపరంగా మైనారటీలుగా న్నవారికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని , వారిని ఎస్సీల్లో చేర్చాలని సూచించింది.
కోవింద్ అప్పటి వ్యాఖ్యలు ఇవీ
రంగనాథ్ మిశ్రా కమిషన్ సూచనపై రామ్నాథ్ కోవింద్ ప్రతిస్పందిస్తూ - ముస్లింలను, క్రైస్తవులను ఎస్సీల్లో ఎలా చేరుస్తారని, వారంతా ఏలియన్స్ వంటివారని అన్నారు. ఆ మాటలపై క్షమాపణ చెప్పాలని సజ్జాద్ సుభాన్ కోవింద్ను డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ఈ విషయం అంగీకరించాలి
ఇక్కడ నివసించే అన్ని మతాలవారికి, ప్రతి ఒక్కరికీ చెందిందని కోవింద్ గుర్తించాలని సజ్జాద్ సుభాన్ అన్నారు. ముస్లిం, హిందువు, సిక్కు, లేదా క్రైస్తవులు ఎవరైనా సరే బారతదేశానికి చెందినవారని రాష్ట్రపతి గుర్తించాలని, లేదంటే విశ్వవిద్యాలయంలోకి ఆహ్వానం ఉండదని అన్నారు. రాష్ట్రపతి స్నాతకోత్సవానికి లేకున్నా ఏమీ కాదని అన్నారు.
7న యూనివర్శిటీ స్నాతకోత్సవం
ఏఎంయూలో నెల 7వ తేదీన జరిగే స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హోదాలో రామ్నాథ్ కోవింద్ హాజరవుతున్నారు. దీంతో విద్యార్థి సంఘం నాయకుడు సజ్జాద్ సుభాన్ కోవింద్ వ్యాఖ్యలపై క్షమాపణకు డిమాండ్ చేశారు.