అమూల్ పాలు..ధరల పొంగు: లీటర్కు ఎంత పెరిగిందంటే?
అహ్మదాబాద్: అమూల్ పాల ధరలు పెరిగాయి. లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర ధరలు పెరిగాయి. పెరిగిన రేట్లు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయి. అమూల్ బ్రాండ్నేమ్గా దేశవ్యాప్తంగా పాల విక్రయ కార్యకలాపాలను కొనసాగిస్తోన్న గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ సోధి సోమవారం వెల్లడించారు. ధరల పెంపు ప్రభావం ఒక్క పాలపైనే కాకుండా.. ఇతర ఉత్పత్తులకూ వర్తిస్తుందని చెప్పారు.
పాలను కొనుగోలు చేస్తున్నందున పాడి రైతులకు చెల్లించాల్సిన ధరను భారీగా సవరించాల్సి వచ్చిందని, ఫలితంగా సంస్థపై ఆర్థిక భారం పడిందని అన్నారు. కొంతమేరకైనా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో పాల ధరలను పెంచాల్సి వచ్చిందని చెప్పారు. పశువులకు దాణా కొరత, వాటి పోషణ వ్యయం రెట్టింపు కావడం వల్ల తమకు చెల్లించాల్సిన పాల రేట్లను పెంచాల్సిందిగా చాలా కాలం నుంచీ పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారని సోధి తెలిపారు. పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తాము వారికి చెల్లించే మొత్తాన్ని భారీగా పెంచాల్సి వచ్చిందని వివరించారు. ఫలితంగా- సంస్థపై ఆర్థిక భారం పడిందని అన్నారు.
గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యలో మొత్తం 36 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వారందరూ రోజూ సమాఖ్యకు పాలను విక్రయిస్తుంటారు. ఒక్క గుజరాత్లోనే 18,700 గ్రామాల నుంచి పాలను సేకరిస్తుంటారు. రోజూ కనీసం 2 కోట్ల 30 లక్షల పాలను ఈ సమాఖ్య సేకరిస్తుంటుంది.