ఎస్పీ బాలుతో కలిసి అమూల్ బేబీ పాట... గాన గంధర్వకుడికి గొప్ప నివాళి....
గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74)కు పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ సంస్థ గొప్ప నివాళి అర్పించింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి అమూల్ బేబీ పాట పాడుతున్నట్లుగా ఉన్న ఓ బ్లాక్&వైట్ డూడుల్ను అమూల్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు,ఎస్పీబీ పాపులర్ పాటల్లో ఒకటైన 'తేరే మేరే బీచ్ మే కైసా తా యే బంధన్ అంజనా...' అన్న చరణాలను ఆ డూడుల్పై రాసింది.
సందర్భానుసారం సరైన కొటేషన్తో అమూల్ చేసిన ఈ పోస్టు చాలామందిని ఆకట్టుకుంటోంది. బాలుకు ఇది గొప్ప నివాళి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ డూడుల్ వైరల్గా మారింది. 'తేరే మేరే బీచ్ మే' పాటను 1981లో కమల్ హాసన్ హిందీ చిత్రం ఏక్ దూజే కె లియే కోసం బాలసుబ్రహ్మణ్యం,లతా మంగేష్కర్ కలిసి పాడారు.
కాగా,గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం(74) కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఒంటిగంటకు కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజుల పాటు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందిన బాలు కోవిడ్ నుంచి కోలుకున్నారని ఒక దశలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.అయితే ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగించారు. కొంత కాలం ఎక్మో సపోర్ట్తో వైద్యం అందించినా... బాగానే కోలుకుంటుండటంతో ఆ సపోర్ట్ తొలగించి వెంటిలేటర్పై చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. గత పది రోజులుగా ప్రతీరోజూ ఫిజియో థెరఫీ కూడా చేశారు.
ఇక ఆయన కోలుకుంటారని అంతా భావిస్తున్న వేళ గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో శుక్రవారం ఆయన కన్నుమూశారు. శనివారం(సెప్టెంబర్ 26) చెన్నై శివారులో ఉన్న రెడ్హిల్స్ లోని ఆయన ఫామ్హౌస్లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.