చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ప్లాంట్ అమ్మకం: రూ.21 కోట్లకు కొన్న అమూల్.. !
అహ్మదాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్లాంట్.. చేతులు మారింది. ఈ ప్లాంట్ను 21 కోట్ల 20 లక్షల రూపాయలకు అమూల్ సంస్థ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం ఆమోదం తెలిపారు. త్వరలోనే అమ్మకం ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.
పంజాబ్ ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని భంబ్రి గ్రామంలో ఉందీ ప్లాంట్. పాలు, పెరుగు, పాల ఆధారిత పదార్థాలను తయారు చేస్తుంటారు ఇక్కడ. ఎక్కడ, ఎలా ఉన్నది, అలా ప్రాతిపదికన ఈ ప్లాంట్ను కొనుగోలు చేయడానికి అమూల్ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ప్లాంట్ను నిర్మించిన స్థలం, భవనం, యంత్రాలు, ఇతర పరికరాలను కలుపుకొని 21 కోట్ల 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలను పంపించింది.
దీనపై హెరిటేజ్ ఫుడ్స్ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈ బోర్డులో చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, దేవినేని సీతారామయ్య, శ్రీవిష్ణురాజు నంద్యాల, రాజేష్ థాకూర్ అహూజా, అపర్ణ సురభి, డాక్టర్ నాగరాజ నాయుడు వడ్లమూడి ఉన్నారు. బోర్డు డైరెక్టర్లు ఏకాభిప్రాయానికి వచ్చిన అనంతరం పంజాబ్లోని ప్లాంట్ను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి అమూల్ యాజమాన్యం పంపించిన ప్రతిపాాదనలను ఆమోదించారు.
Recommended Video
ఈ ప్లాంట్ను కొనుగోలు చేయడం వల్ల ఉత్తరాదిన తమ సంస్థ కార్యకలాపాలు మరింత విస్తృతమౌతాయని ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (అమూల్) మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ సోధి వెల్లడించారు. ప్రత్యేకించి- పంజాబ్లో తమ వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరించానికి అవకాశం లభించినట్టయిందని అన్నారు. తమ ప్రతిపాదనలన అంగీకరించడం పట్ల హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు.