నా కూతుర్ని ఏం చేసినా తప్పులేదు: అమూల్య తండ్రి.. ఇంటిపై బీజేపీ దాడి.. ఓవైసీనే టార్గెట్గా పావులు
Recommended Video
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా బెంగళూరు సిటీలోని ఫ్రీడంపార్క్లో నిర్వహించిన సభలో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేసిన న్యాయ విద్యార్థిని అమూల్య లియోన్ వ్యవహారం గంటగంటకూ ముదురుతోంది. ఇప్పటికే ఆమెపై ఉప్పారపేట పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసు నమోదుకాగా, సభ నిర్వాహకులు, ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపైనా చర్యలు తీసుకునే దిశగా కర్నాటక ప్రభుత్వం యోచిస్తున్నది.
మరోవైపు చిక్కమగళూరు జిల్లాలోని అమూల్య ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అమూల్యపై, సభ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, హిందూత్వ సంఘాలు ఆందోళనకు దిగాయి. కూతురిని ఉద్దేశించి అమూల్య తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్వయంగా రంగంలోకి దిగి కీలక ప్రకటన చేయడంతో వివాదం మరింత పెద్దదైంది.
మేం కూడా బీజేపీ సపోర్టర్లమే: అమూల్య తండ్రి
పాక్ అనుకూల నినాదాలు చేసి జైలు పాలైన అమూల్యకు కుటుంబ పరంగా ఎలాంటి సాయం చేయబోమని ఆమె తండ్రి వోజల్ట్ మీడియాతో అన్నారు. చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా శివపురలోని తమ ఇంటిపై గురువారం రాత్రి బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని, పక్కనే ఉన్న కోళ్ల ఫారాన్ని కూడా ధ్వంసం చేశారని ఆయన వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు కానిస్టేబుళ్లను సెక్యూరిటీగా పంపారని తెలిపారు. చాలా కాలంగా తాము కూడా బీజేపీ మద్దతుదారులుగా కొనసాగుతున్నామని, ఉడిపి-చిక్కమగళూరు ఎంపీ శోభా కరంద్లాజే, శ్రీనగరి బీజేపీ ఇన్ చార్జి జీవన్ రాజ్ తోనూ మంచి సంబంధాలున్నాయని అమూల్య తండ్రి తెలిపారు.
నా కూతురు మాట వినేదికాదు..
‘‘బెంగళూరులో లా చదువుతోన్న నా కూతురు కొంతకాలంగా ఉద్యమాలంటూ ముస్లిం యువకుల వెంట తిరుగుతోంది. బాగా చదివి ఉద్యోగం సంపాదించాలని, ఆ తర్వాత సమాజం కోసం ఏదైనా చేయొచ్చని ఎంత చెప్పినా వినేదికాదు. బెంగళూరు సభలో ఆమె మాట్లాడింది చాలా తప్పు. ఇందుకుగానూ ఎలాంటి శిక్ష పడినా మేం బాధపడం. బెయిల్ కోసం కూడా ప్రయత్నించబోము''అని అమూల్య తండ్రి వొజాల్ట్ మీడియాకు చెప్పారు.
తీవ్రవాదులతో లింకులు: సీఎం యెడ్డీ
సీఏఏ వ్యతిరేక సభలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోన్ కు తీవ్రవాదులతో సంబంధాలున్నట్లు తెలిసిందని కర్నాటక సీఎం యడ్యూరప్ప సంచలన ప్రకటన చేశారు. కుటుంబ కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నదంటే బయటి వ్యక్తుల మాటలకు అమూల్య ఎంతగా ప్రభావితమైందో అర్థం చేసుకోవచ్చని, ఘటనతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామని సీఎం అన్నారు.
హిందూ సంస్థల ఆందోళన..
అమూల్యపై దేశ్రద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను కోర్టులో హాజరుపర్చి, 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించారు. అయినప్పటికీ బీజేపీతోపాటు శ్రీరాంసేన, హిందూ జనజాగృతి సమితి తదితర హిందూ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించాయి. బెంగళూరు సిటీలో పలు చోట్ల రాస్తారోకోలు చేసేందకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.
ఓవైసీపై బీజేపీ నిప్పులు
దేశంలో సీఏఏ వ్యతిరేక నిరసనల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని బెంగళూరు సభతో మరోసారి తేటతెల్లమైందని, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఎంతగా బుకాయించినా వాస్తవం ఇదేని, జాతి వ్యతిరేకులంతా వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోవాలని కర్నాటక బీజేపీ శాఖ అధికారిక ప్రకటన చేసింది. అమూల్య లియోన్ నినాదంతో తనకుగానీ, పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇదివరకే స్పష్టం చేశారు.