విధి ఆడిన వింత నాటకం : భార్య కళ్లెదుటే భర్త అదృశ్యం..
పల్వాల్ : అతను పైలెట్.. ఆమె ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్.. పెళ్లై ఏడాదే అయింది. సాఫీగా జీవితం సాగిపోతోంది. అది చూసి కాలానికి కన్ను కుట్టినట్లుంది. వారి జీవితాల్లో అనుకోని ఉపద్రవం తెచ్చిపెట్టింది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్లిన భార్యాభర్తలు తమ విధి నిర్వాహణలో నిమగ్నమయ్యారు. భర్త విమానం టేకాఫ్ తీసుకోగా... భార్య ఏటీసీ నుంచి సూచనలు ఇస్తోంది. ఇంతలో అనుకోని పరిణామం. భర్త నడుపుతున్న విమానం రాడార్ నుంచి కనుమరుగైంది. భార్య కళ్లెదుటే భర్త అదృశ్యమయ్యాడు. దీంతో ఆమె జీవితం అంధకారమైంది.
సోమవారం అదృశ్యమైన విమానం
సోమవారం భారత్, చైనా సరిహద్దుల్లో ఏఎన్ 32 విమానం ఆచూకీ లేకుండా పోయింది. దానికి పైలెట్ ఆశిష్ తన్వర్ కాగా.. ఆయన భార్య సంధ్యా తన్వర్ ఆ రోజు ఏటీసీలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.27గంటలకు అరుణాచల్ప్రదేశ్లోని మెచుకాలోని వైమానిక స్థావరం నుంచి ఏఎన్ -32రకం విమానం 12 మందితో బయలుదేరింది. విమానం బయలుదేరిన అరగంట తర్వాత ఒంటి గంట సమయంలో కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి.
భార్య కళ్లెదుటే భర్త అదృశ్యం
ఆ సమయంలో జోర్హాట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా సంధ్య ఉన్నారు. భర్త నడుపుతున్న విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని, కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని అందరికన్నా ముందు ఆమెకే తెలిసింది. దీంతో సంధ్య విషయాన్ని మిగతా అధికారుల దృష్టికి తెచ్చింది. తన కళ్లెదుటే భర్త అదృశ్యం కావడం చూసిన సంధ్య షాక్కు గురైంది. రోజులు గడుస్తున్నా భర్త ఆచూకీ తెలియక మౌనంగా రోదిస్తోంది.
ఏడాది క్రితం వివాహం
హర్యానా పల్వాల్లోని దీఘోట్ గ్రామానికి చెందిన ఆశీష్ బీటెక్ పూర్తి చేశాడు. 2013లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరాడు. 2018లో ఆశీష్కు సంధ్యతో వివాహమైంది. అప్పటికి ఇద్దరూ ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాలో పనిచేస్తున్నారు. పెళ్లైన ఏడాదికే ఇలాంటి ప్రత్యక్ష నరకం ఎదుర్కోవాల్సి వస్తుందని సంధ్య కలలో కూడా ఊహించలేదు. ఆశిష్ జాడ తెలియక అతని కుటుంబసభ్యులు పడుతున్న వేదన వర్ణనాతీతం.
దట్టమైన పొగ చూశామంటున్న స్థానికులు
సోమవారం మధ్యాహ్నం ఎయిర్ఫోర్స్ విమానం అదృశ్యమైన సమయంలో దగ్గరలోని పర్వత ప్రాంతంలో దట్టమైన పొగలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సియాంగ్, పశ్చిమ సియాంగ్ జిల్లాలోని ఎత్తైన పర్వతాల్లో అన్వేషణ ముమ్మరం చేశారు. అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.