రెండు రాష్ట్రాలను వణికించిన భూకంపం: పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో ఏకకాలంలో: భారీ తీవ్రతతో
న్యూఢిల్లీ: ఉత్తరాదిన రెండు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. కొన్ని నిమిషాల వ్యవధిలో రెండు రాష్ట్రాల్లో సంభవించిన భూకంపాలు స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి. వారిని వణికించాయి. గుజరాత్లోని రాజ్కోట్, అస్సాంలోని కరీంగంజ్ ప్రాంతాల్లో దాదాపుగా ఏకకాలంలో ఈ భూకంపాలు నమోదు అయ్యాయి. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత ప్రమాదకర స్థాయిలోనే నమోదు అయ్యాయి. కొద్దిరోజులుగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాలను వణికిస్తోన్న భూకంపం.. భారత్ పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో చోటు చేసుకుంది.
రాజ్కోట్లో గురువారం ఉదయం 7:40 నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేకలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. రాజ్కోట్ సమీప ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అంటున్నారు. రాజ్కోట్లో కొన్ని భవనాలు పాక్షికంగా బీటలు వారినట్లు చెబుతున్నారు. సెకెన్ల పాటు భూకంపం సంభవించినట్లు స్థానికులు చెప్పారు.
సరిగ్గా 17 నిమిషాల తరువాత అస్సాంలోని కరీంగంజ్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. ఈ ఉదయం 7:57 నిమిషాలకు కరీమ్గంజ్ ప్రాంతంలో భూమి కంపించినట్లు సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. భూకంప ప్రభావం స్పష్టంగా కనిపించిందని, ఫలితంగా ఇళ్లను వదిలి, రోడ్ల మీదికి పరుగులు తీశామని కరీమ్గంజ్ వాసులు చెబుతున్నారు.
జిల్లాగా అమరావతి?: కొత్త జిల్లాల సంఖ్య 29 వరకూ: 3 రాజధానులు..3 ప్రత్యేక జిల్లాలుగా
Recommended Video
ఇదివరకు న్యూఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని ప్రాంతాలను వణికించాయి వరుస భూకంపాలు. వాటివల్ల ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించనప్పటికీ.. మున్ముందు ఏదైనా భారీ ప్రమాదం సంభవించవచ్చనే సంకేతాలను ఇచ్చిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. న్యూఢిల్లీ-ఎన్సీఆర్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్లల్లో వరుస భూకంపాలు చోటు చేసుకున్నాయి. మిజోరాంలోనూ భూకంపాలు సంభవించాయి. ఈ సారి పశ్చిమ ప్రాంతంలోని గుజరాత్, ఈశాన్యంలోని అస్సాంలో కొన్ని నిమిషాల వ్యవధిలో ఇవి సంభవించడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.