కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో భూప్రకంపనలు: వరుసగా రెండో రోజు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు నమోదు అయ్యాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.7గా నమోదైంది. ఈ ప్రకంపనల తీవ్రత చాలా స్వల్పమే అయినప్పటికీ.. వరుసగా రెండోసారి సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీ సహా.. దీనికి ఆనుకుని ఉన్న వజీరాబాద్, ఘజియాబాద్, నొయిడా, ఫరీదాబాద్ వంటి ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత 3.5గా నమోదైంది. మరుసటి రోజు మధ్యాహ్నానికి మరోసారి ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మరోసారి ప్రకంపనలు నమోదు అయ్యాయి. దీన్ని తేలిగ్గా తీసుకోలేమని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్సీఎస్) అధికారులు తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 26 నిమిషాల సమయంలో ఎన్సీఆర్ పరిధిలో భూప్రకంపనలు నమోదు అయ్యాయని, భూ ఉపరితలం నుంచి అయిదు కిలోమీటర్ల లోతున ప్రకంపనలు సంభవించినట్లు సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు వెల్లడించారు. ఈ రెండు సంఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు సూచించారు.