పాక్ కుట్రలు ఫలించబోవు: భారత భూభాగాలను కలుపుకొని చూపిన కొత్త మ్యాప్పై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేసి ఆగస్టు 5 నాటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ తన పైత్యాన్ని ప్రదర్శించి భారత భూభాగాలైన జమ్మూకాశ్మీర్, లడఖ్, జూనాగఢ్ ప్రాంతాలను కొత్తగా విడుదల చేసిన తమ దేశ మ్యాప్లో చూపించింది. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది ఓ రాజకీయ అసంబద్ధ చర్యగా పేర్కొంది.
Recommended Video
పాకిస్థాన్ చేసిన ఈ హాస్యాస్పదమైన వాదనలకు చట్టపరమైన ప్రామాణికత లేదా అంతర్జాతీయ విశ్వసనీయత లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. .పాకిస్థాన్ చేసిన ఈ పని సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచేందుకేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన పొలిటికల్ మ్యాప్ అర్థరహితమని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. వాస్తవాలను మరిచి పాక్ ప్రధాని ఈ పటానికి ఆమోదం తెలపడం దుశ్చర్యేనని అన్నారు. భారత ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేందుకు పాక్ చేసే కుట్రలు ఎప్పటికీ విజయం సాధించవని స్పష్టం చేశారు.
భారత ప్రాంతాలను కలపుకుని పాకిస్థాన్ దుస్సాహసం
పాకిస్థాన్ మరో దుస్సాహాసానికి పాల్పడింది. ఆగస్టు 5 నాటికి జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది కావస్తున్న వేళ.. పెను వివాదానికి తెరలేపింది. జమ్మూకాశ్మీర్ను కూడా తమ దేశ భూభాగాలుగా చూపిస్తూ కొత్త పొలిటికల్ మ్యాప్ను విడుదల చేసింది.
పాకిస్థానీ జాతీయుల ఆకాంక్షలకు ప్రతిబింభంగా కొత్త మ్యాప్ ఉందంటూ ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఈ కొత్త మ్యాప్ వివరాలను పాఠశాల సిలబస్లో కూడా చేరుస్తామని విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి వ్యాఖ్యానించాడు.
కాగా, ఇప్పటి వరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ తోపాటు గిల్గిత్ బల్టిస్తాన్ ప్రాంతాలను తమ ప్రాంతాలుగా పేర్కొన్న పాక్.. ఇప్పుడు జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కూడా తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్ విడుదల చేసి తన పైత్యాన్ని మరోసారి చాటుకుంది. భారత్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ కాదు.. భారత్ దురాక్రమిత జమ్మూకాశ్మీర్ అంటూ ఇటీవల పాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఆగస్టు 5న అన్ని టీవీ, రేడియో ఛానళ్లు కూడా పాకిస్థాన్, ఏజేకే జాతీయ గీతాలను ప్రసారం చేయాలని, ఆ తర్వాత ఒక నిమిషంపాటు సైలెన్స్ పాటించాలని పాక్ సర్కారు పేర్కొంది. కాశ్మీర్లో భారత దారుణాలకు నిరసనగా టీవీ ప్రెజెంటర్స్ బ్లాక్ బ్యాండ్లు ధరించాలని, ఛానల్ లోగోస్ కూడా నలుపు రంగులో ఉండాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. కాగా, పాక్ కొత్త మ్యాప్పై భారత్ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా భారత నెటిజన్లు పాక్కు కౌంటర్లు ఇస్తున్నారు. పాకిస్థాన్ పగటి కలలు కనడం మానుకోవాలని చురకలంటిస్తున్నారు.