ఇండిగో విమానంలో 172 మంది ప్రయాణికులు..హైటెన్షన్: ఎమర్జెన్సీ ల్యాండింగ్
భోపాల్: ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడం కలకలం రేపింది. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండటం అధికారులను ఆందోళనకు గురి చేసింది. సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లు తేల్చారు. గుజరాత్లోని సూరత్ నుంచి 172 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం కోల్కతలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. మార్గమధ్యలో సుమారు 32 వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు.
దీనితో సమీపంలో ఉన్న భోపాల్ రాజాభోజ్ విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులను సంప్రదించారు. సాంకేతిక లోపం తలెత్తినట్లు వివరించారు. అప్పటికప్పుడు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. దీనితో సురక్షితంగా ఇండిగో ఫ్లైట్.. భోపాల్లో ల్యాండ్ అయింది. విమానాశ్రయం సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తంచే పనిలో పడ్డారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు భోపాల్ విమానాశ్రయం డైరెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎవరికి గాయాలు గానీ, ప్రాణాపాయం గానీ సంభవించలేదని స్పష్టం చేశారు. మరమ్మతుల అనంతరం మళ్లీ కోల్కతకు పంపిస్తామని పేర్కొన్నారు. కొద్దిరోజుల వ్యవధిలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడం ఇది రెండో సారి. ఇటీవలే స్పైస్జెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఒడిశాలోని ఝార్సుగూడ విమానాశ్రయం నుంచి 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం డెహ్రాడూన్కు వెళ్లాల్సి ఉండగా.. మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో కోల్కతలో దింపారు. క్యాబిన్ ప్రెషర్ అలారం మోగడం వల్ల అప్పటికప్పుడు స్పైస్జెట్ విమానాాన్ని కోల్కతలో ల్యాండ్ చేశారు.