Delhi Elections:కేజ్రీకి కలిసొచ్చేదేంటి..కమలం వికసిస్తుందా, కాంగ్రెస్ టార్గెట్ ఏంటి?
కొత్త ఏడాదిలో తొలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి సోమవారం రోజున ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. కొత్త ప్రభుత్వాన్ని 1.5 కోట్ల మంది ఓటర్లు ఎన్నుకోనున్నారు. అయితే ప్రస్తుత ఆప్ సర్కార్కు కలిసి వచ్చే అంశాలేంటి..? బీజేపీ ఢిల్లీలో పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది.. కాంగ్రెస్కు ఢిల్లీ ఎన్నికలు కంబ్యాక్గా ఉంటాయా..?
వ్యూహాలు సిద్ధం చేస్తున్న పార్టీలు
ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఢిల్లీ పీఠంను ఎలాగైనా సరే దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ మాత్రం ఢిల్లీకి తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే తిరిగి అధికారం కట్టబెడుతాయన్న కాన్ఫిడెన్స్తో ఉంది. ఇక కాంగ్రెస్ కూడా తమ ప్రయత్నాలు చేస్తోంది. అయితే మూడు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అయితే ఒక్కో పార్టీకి కలిసొచ్చే అంశాలేంటో ఓసారి చూద్దాం.
సంక్షేమ పథకాలే అధికారంలోకి తీసుకొస్తాయి:కేజ్రీవాల్
ముందుగా అధికారిక ఆప్ సర్కార్ విషయం పరిశీలిస్తే కేజ్రీవాల్ వన్స్ మోర్ నినాదంతో ఢిల్లీ ఎన్నికలకు ఆప్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ పార్టికి కేజ్రీవాలే ప్రధాన బ్రాండ్గా ఉన్నారు. ఆప్ పార్టీ ఎలాగైనా సరే విజయం సాధించాల్సి ఉంటుంది. అలా కాకపోయినా మెజార్టీ స్థానాల్లోనైనా విజయం సాధిస్తే ఆపార్టీ సేఫ్గా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ చెప్పుకోదగ్గ సీట్లు రాకపోతే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కనుమరుగవడం ఖాయమే అని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఢిల్లీ తర్వాత ఆప్ ప్రభావం ఒక్క పంజాబ్లోనే ఉంది. పంజాబ్లో 19 అసెంబ్లీ స్థానాలు ఆప్ ఖాతాలో ఉండగా ఒక్క లోక్సభ స్థానం మాత్రమే ఉంది.
బీజేపీ బ్రాండ్ మోడీనే..సీఎం అభ్యర్థి ప్రకటించకుండానే..
ఇక బీజేపీ విషయానికొస్తే 2015 ఎన్నికల్లో బీజేపీ 3 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ విజయావకాశాలన్నీ ప్రధాని మోడీపైనే ఆధారపడి ఉన్నాయి. 2013 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా మోడీ గాలీ వీచింది. అయినప్పటికీ 2015లో ఢిల్లీని కైవసం చేసుకోలేకపోయింది. ఒకవేళ బీజేపీ గెలిస్తే 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీలో అధికారం చేపట్టినట్లు అవుతుంది. కేజ్రీవాల్ చేసిన పొరపాట్లను బీజేపీ ఎత్తి చూపే ప్రయత్నం చేస్తోంది.ఇందులో భాగంగా అధికారంలోకి వస్తే ఢిల్లీలోని అనధికారిక కాలనీలను రెగ్యులరైజ్ చేస్తామంటూ మంత్రం వేస్తోంది. ఇదే మంత్రాన్ని కాంగ్రెస్ 2008లో ఉపయోగించి అధికారంలోకి వచ్చింది. బీజేపీ కూడా ఇదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏది ఏమైనప్పటికీ మోడీ బ్రాండ్తోనే బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ ఎన్నికలకు వెళుతుండటంతో దీన్నే అరవింద్ కేజ్రీవాల్ అస్త్రంగా ఉపయోగిస్తున్నారు.
నిరసనలను బీజేపీ ఎలా డీల్ చేస్తుంది..?
2008లో బీజేపీ వీకే మల్హోత్రాను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. 2013లో హర్షవర్ధన్ను 2015లో కిరణ్ బేడీలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ వీరంతా విఫలమయ్యారు. అయితే కేంద్రంలో బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కూడా కమలం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పటికే జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్సీ)లపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మోడీ బ్రాండ్ ఎంత వరకు మోసుకొస్తుందో వేచిచూడాలి.
షీలా దీక్షిత్ మృతితో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..?
ఇక కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. 2015లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. 2014,2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు గెలవలేదు. ఇక లాభం లేదని భావించిన రాహుల్ గాంధీ అప్పుడు షీలా దీక్షిత్ను రంగంలోకి దించారు. 2019లోక్సభ ఎన్నికల సందర్భంగా షీలా దీక్షిత్ ఎంట్రీ ఆప్ను దెబ్బతీసింది. దాదాపు 5 నుంచి 7 లోక్సభ స్థానాల్లో ఆప్ మూడో స్థానానికే పరిమితమైంది. అదేసమయంలో కాంగ్రెస్ కూడా తన ఓటుశాతంను పెంచుకుంది. అయితే షీలా దీక్షిత్ మృతి చెందడంతో ఆ పార్టీ తిరిగి పుంజుకుంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నప్పటికీ అది అసాధ్యంగానే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మోడీ ప్రభుత్వం పై వ్యతిరేకత, కేజ్రీవాల్ సర్కార్పై వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకోగలిగితే ఏమైనా జరిగే అవకాశం ఉందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.