రంగంలోకి రాహుల్ గాంధీ, తోకముడిచిన సీనియర్లు.. కాంగ్రెస్లో కుమ్ములాట టీ కప్పులో తుఫానే..?
కాంగ్రెస్.. 130 ఏళ్లకు పైగా చరిత్ర గల పార్టీలో నేతలు/ శ్రేణులకు వ్యక్తిగత స్వాతంత్ర్యం ఎక్కువే.. అదే సమయంలో చాలా సందర్భాల్లో అధి నాయకత్వం మాటే చెల్లుబాటు అవుతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మాత్రం కాంగ్రెస్ అధినేత అంటే గాంధీ-నెహ్రూ కుటుంబీకులే. ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే 2019లో అధికారం కోల్పోయాక రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీ నుంచి తప్పుకున్నప్పటీ నుంచి సీన్ మారుతూ వస్తోంది.
తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ బాధ్యతలు చేపట్టినా.. అనారోగ్య సమస్యలను ఆమెను వెంటాడుతున్నాయి. దీంతో కొందరు దీనిని అదనుగా తీసుకొని.. అధినాయకత్వ మార్పుపైనే అభిప్రాయం సేకరించారు. కానీ యువరాజు రాహుల్ గాంధీ రంగంలోకి దిగి.. స్వయంగా ఫోన్లు చేయడంతో తోకముడిచారు. ఆ 23 మంది లేఖ రాయడం నుంచి సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా తిరిగి తాత్కాలిక అధ్యక్షురాలి వరకు జరిగిన పరిణామాలపై ఓసారి పరిశీలిద్దాం.
గాంధీ కుటుంబానికి గులాంగిరీ చేయాల్సిందే...
కాంగ్రెస్ పార్టీలో ఎంతటి నేత అయినా.. గాంధీ కుటుంబాలకు గులాంగిరీ చేయాల్సిందే. ఈ మాట కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే రాజస్తాన్లో సచిన్ పైలట్ తిరుగుబాటు ఎగరేసిన సమయంలో కీలక నేతలు గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్, ఆనంద్ శర్మ, భూపిందర్ హుడా లేఖ రాశారు. అంతకుముందే నాయకత్వ మార్పుపై రాష్ట్రాలవారీగా నేతల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించారు. నాయకత్వ మార్పు చేయాల్సిందేనని లేఖ రాయడంతో ఒకింత కలవరానికి గురిచేసింది. పరిస్ధితులను నిశీతంగా గమనిస్తోన్న రాహుల్ గాంధీ.. పైలట్ను బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. రాజస్తాన్లో ప్రభుత్వం నిలబడ్డాక.. లేఖల అంశంపై విమర్శలు గుప్పించారు. నాయకత్వ మార్పుపై కామెంట్లు రావడంతో.. సోనియా కూడా రాజీనామాకు సిద్దపడ్డారు. దీంతో సోమవారం కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ.. ఆ సీనియర్లపై ఆగ్రహాం వ్యక్తం చేయడంతో గొడవ పతాకస్థాయికి చేరింది.
Recommended Video
ఫోన్లు చేయడంతో దిగిరాక తప్పలేదు..
రాహుల్ ఆగ్రహాం వ్యక్తం చేయడంతో గులాం నబీ ఆజాద్ అండ్ టీం కూడా అదేవిధంగా స్పందించింది. ట్వీట్లతో ధీటుగా రియాక్టయ్యింది. దీంతో రాహుల్ ఒక్కొక్కరికీ ఫోన్ చేశారు. దీంతో నేతలు దిగిరాక తప్పలేదు. రాహుల్ తమను అలా అనలేదని చెప్పుకొచ్చారు. బీజేపీతో చేరి కుట్ర పన్నారని కామెంట్ చేయలేదని తెలిపారు. ఒక్కో నేత మెత్తబడటంతో నాయకత్వ మార్పు అంశం కాస్త పక్కకు జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత ఏకే ఆంటోని ప్రభృతులు సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా ఉండాలని కోరారు. ఘర్షణకు దారితీసిన నేతలు.. కూల్ అవడంతో నాయకత్వ మార్పు అంశం తాత్కాలికంగా కనుమరుగయ్యింది. కానీ సోనియా గాంధీ ఆరునెలల వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తిస్తారని.. తర్వాత పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమిస్తామని స్పష్టంచేసింది. దీంతో నాయకత్వ మార్పు అనే అంశం ఇప్పట్లో లేదని అర్థమవుతోంది.
ధిక్కార స్వరం వినిపించి.. పార్టీని వీడిన నేతలు కూడా..
ఇప్పుడే కాదు గతంలో కూడా హై కమాండ్పై కొందరు నేతలు ధిక్కారస్వరం వినిపించినా సందర్భాలు ఉన్నాయి. మరికొందరు పార్టీని వీడి బయటకు కూడా వెళ్లారు. అలా వెళ్లినవారిలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. అందుకు రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. ధిక్కార స్వరం వినిపించిన నేతలు చివరికీ కాంప్రమైజ్ కావాల్సిందే తప్ప.. వారికి అనుకూలంగా వ్యవహరించిన సందర్భాలు అరుదు. కాంగ్రెస్ అధినాయకురాలిగా సోనియా ఉన్నా.. వెనకుండి రాహుల్ గాంధీ నడిపిస్తున్నారని సీనియర్లు అంటున్నారు. సీనియర్లు అయినా తమను రాహుల్ లెక్కచేయడం లేదని వారి వాదన. దీనికి సరైన కారణాలు కూడా ఉన్నాయి. యువ నాయకత్వంతో ముందుకెళ్లాలని రాహుల్.. అంటూంటే.. సీనియర్లకు సోనియా ఛాన్స్ ఇస్తున్నారు. పైకి తల్లీ కొడుకులు అయినా.. వారికి కోటరీ కూడా ఉంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ సమయంలో సీఎంల ఎంపికపై తర్జన భర్జన జరిగింది.
సోనియా-రాహుల్ మార్క్ రాజకీయాలు...
మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియాను, రాజస్తాన్లో సచిన్ పైలట్ను సీఎం చేయాలని రాహుల్ గాంధీ భావించారు. కానీ సోనియాగాంధీ అందుకు అంగీకరించలేదు. తల్లి మాటకు గౌరవం ఇచ్చి.. మధ్యప్రదేశ్లో కమల్ నాథ్, రాజస్తాన్లో అశోక్ గెహ్లట్ ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు. కానీ కొన్ని నెలలకే మధ్యప్రదేశ్లో లుకలుకలు మొదలయ్యాయి. సిందియా తిరుగుబాటు ఎగరేశారు. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వ కూలిపోయి.. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత పైలట్ కూడా తిరుగుబాటు ఎగరేసిన.. అక్కడ ఆయనకు బీజేపీలో కీలకనేత వసుంధర రాజే నుంచి ప్రతీకూలత ఏర్పడటంతో కమల దళంలోకి వెళ్లడం సాధ్యం కాలేదు. తగిన ప్రాధాన్యం ఉండదని భావించి.. చివరికీ రాహుల్, ప్రియాంకతో చర్చలు జరిపి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక్కడ కూడా పైలట్.. బీజేపీలో చేరితే మరో రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రెస్ కోల్పోయేది. అప్పుడు సీనియర్లకు అవకాశం ఇవ్వడమనే సోనియా నిర్ణయం తప్పు అనే అవకాశం ఎక్కువగా ఉండేది. కానీ పైలట్ రాజీ పడటంతో ఆ ఆపవాదు తప్పింది. కానీ రాహుల్ మాత్రం యువ నేతలతో ముందడుగు వేయాలని తన ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు ప్రాధాన్యం ఉండదని భావించి.. కొందరు సీనియర్లు ధైర్యం చేసే సాహసం చేసినా.. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ప్రకారం మిన్నకుండిపోవాల్సి వచ్చింది.
చివరికీ కాంప్రమైజ్.. సోనియాకే బాధ్యతులు, మూడేళ్ల ముందు రాహుల్ ఏంట్రీ..
నాయకత్వ మార్పు అని గొంతు చించుకొన్న.. సోనియా, రాహుల్ ముందు అదీ పనిచేయలేదు అని మరోసారి నిరూపితమయ్యింది. లేఖ రాసిన నేతలే వెనక్కి తగ్గడంతో ఇదీ కాంగ్రెస్ మార్క్ రాజకీయం అని అవగతమవుతోంది. సమావేశం తర్వాత నేతలొచ్చి చెప్పే టీ కప్పులో తుఫానే అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మరో ఆరు నెలలు అంటే ఫిబ్రవరి వరకు సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అంటే సార్వత్రిక ఎన్నికలకు మూడేళ్ల ముందు.. మరోసారి రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. పైకి మాత్రం గాంధీయేతర నేత అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని అంటోన్న.. ఇతరులకు పార్టీ పగ్గాలు ఇచ్చే సాహసం సోనియా, రాహుల్ చేస్తారని అనిపించడం లేదు. మూడేళ్ల సమయంలో.. అంటే 2024 ఎన్నికలకు ముందు తన కోటరినీ పూర్తిగా నియమించుకొని.. మెజార్టీ సీట్లు సాధించడమే రాహుల్ గాంధీ లక్ష్యం. తన నాయకత్వంలో విజయం సాధించి.. ప్రధాని పీఠం అధిష్టించడమే యువరాజు గోల్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.