అనాలిసిస్: హర్యానాలో మెరిసిన కాంగ్రెస్ ..రాహుల్ మౌనం వెనక ఆంతర్యం ఏమిటి..?
మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 2014 కన్నా రెండు రాష్ట్రాల్లో మెరుగైన సీట్లు గెల్చింది. రెండు రాష్ట్రాల్లో హస్తం పార్టీ ప్రదర్శనపై కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆ పార్టీ అధినాయకత్వం మాత్రం కాస్త అసంతృప్తితోనే ఉన్నట్లు కనిపించింది. ఎన్నికల వేళ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని భావిస్తోంది. ఇక రాహుల్ గాంధీ మాత్రం కాంగ్రెస్ ప్రదర్శనపై మౌనం వహించారు. కనీసం గురువారం అర్థరాత్రి వరకు రాహుల్ గాంధీ ఫలితాలపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. కనీసం ట్విటర్ ద్వారా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
బీజేపీ ధీమాపై కాంగ్రెస్ దెబ్బ కొట్టిందా..?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మునపటికంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. అయితే హర్యానాలో మాత్రం అధికార పార్టీ బీజేపీకి చుక్కలు చూపించింది. గట్టి పోటీ ఇచ్చింది. ప్రియాంకాగాంధీ హర్యానా ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తూనే ఉత్తర్ ప్రదేశ్లో 2019లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం కూడా పెరిగిందంటూ చెప్పుకొచ్చారు. అయితే బీజేపీని ఎవరూ కొట్టలేరనే ధీమాతో ఉన్న కాషాయం పార్టీకి హర్యానా ఫలితాలే సమాధానం ఇచ్చాయని సీనియర్లు వ్యాఖ్యానించారు. బీజీపీని కొట్టడం ఎవరి తరం కాదని విపక్షాలు మోకరిల్లాల్సిందే అన్న బీజేపీ మాటలకు ఈ ఫలితాలు గట్టి గుణపాఠం చెప్పాయని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఆనంద్ శర్మ తెలిపారు. హర్యానాలో భూపిందర్సింగ్ హూడా నేతృత్వంలో కాంగ్రెస్ ఓ గట్టి పోటీనిచ్చిందని అభిప్రాయపడ్డ ఆనంద్ శర్మ... ఎన్నికలకు ముందే కొన్ని మార్పులు జరిగి ఉంటే కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ దక్కేదని వెల్లడించారు.
హూడాకు హర్యానా బాధ్యతలు ముందే ఇచ్చి ఉంటే...
హూడాకు హర్యానా బాధ్యతలు ముందే అప్పగించి ఉండిఉంటే కచ్చితంగా ఆరాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరి ఉండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్.హర్యానాలో స్థానిక నేతకు బాధ్యతలు అప్పగించి ఉంటే ఖట్టర్పై ఉన్న అసంతృప్తిని అస్త్రంగా చేసుకుని పావులు కదిపేవారని దీంతో హర్యానా విజయం సాధించి ఉండేదనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం సందర్భంగా భూపిందర్ సింగ్ హూడా జాతీయ సమస్యలపై ఎక్కడ మాట్లాడలేదు. కేవలం స్థానిక సమస్యలపైనే దృష్టి సారించడంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించిందనే ఒపీనియన్ చాలామందిలో వ్యక్తమవుతోంది.
మార్పులు కొన్ని నెలల ముందు జరిగి ఉంటే...
ఇక మరికొన్ని నెలల్లో జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా పార్టీలో పలు మార్పులు చేస్తే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హర్యానాలో నాయకత్వ మార్పు జాప్యంకు కారణం రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ చెబుతోంది. భూపిందర్ సింగ్ హుడాను కాదని అశోక్ తన్వార్ను తీసుకొచ్చారని అయితే అభ్యర్థుల్లో స్ఫూర్తిని నింపడంలో, అందరినీ కలుపుకుపోవడంలో అశోక్ తన్వార్ విఫలమైయ్యారని కాంగ్రెస్ చెబుతోంది. లోక్సభ ఎన్నికలు అశోక్ తన్వార్ నేతృత్వంలో జరిగాయి. అక్కడ పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఒత్తిడిపై తన్వార్ను తప్పించి ఆపై కుమారి సెల్జాకు పీసీసీ చీఫ్ కట్టబెట్టారు. ఇక ఎన్నికలకు ఒక్క నెల ముందు హూడాను సీఎల్పీ నేతగా ప్రకటించింది కాంగ్రెస్. ఈ మార్పులు ముందే చేసి ఉంటే హస్తం పార్టీ హర్యానా ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలిచి ఉండేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనలిస్టులు.
విఫలమైన సమన్వయ కమిటీ
ఇక కాంగ్రెస్ పార్టీ ఓ జాతీయ పార్టీలా ఎన్నికల్లో పోరాటం చేయలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు 10 రోజుల ముందు సమన్వయ కమిటీలో మార్పులు చేయడం వల్ల ఒరిగింది ఏమీ లేదని అది ముందుగానే చేసి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అక్టోబర్ 11న ఒకసారి కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ అయ్యిందని ఆ తర్వాత మరొకసారి మాత్రమే భేటీ అయ్యిందని నేతలు గుర్తుచేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీనే హర్యానా ఎన్నికలను చాలా లైట్గా తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోలా హర్యానాలో ఎక్కువగా ప్రచారం నిర్వహించలేదని చెబుతున్నారు. ఇక సోనియాగాంధీ అస్సలు ప్రచారరంగంలోకి దిగలేదు. రాహుల్ గాంధీ మాత్రం మొత్తం ఏడు ప్రచారాలు నిర్వహించారు. ఇందులో ఐదు మహారాష్ట్రలో నిర్వహించగా మరో రెండు ప్రచారాలు హర్యానాలో చేశారు. మహేంద్రగఢ్లో సోనియాగాంధీ ప్రచారం చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో తప్పుకోవడంతో రాహుల్ గాంధీ అక్కడ ప్రచారం చేశారు.
వర్కింగ్ ప్రెసిడెంట్లతో లాభం లేకుండా పోయింది
ఇక రాహుల్ గాంధీ నియమించిన వర్కింగ్ ప్రెసిడెంట్ల వల్ల లాభం చేకూరలేదనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. హర్యానాలో లేదా ఢిల్లీలో సోనియాగాంధీ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించలేదు. కొన్ని నెలల క్రితమే మహారాష్ట్రలో ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్లను రాహుల్ గాంధీ నియమించారు. వీరంతా ఎన్నికల్లో పోటీ చేయడంతో ఒక నాయకత్వం అనేది కాంగ్రెస్కు లోపించింది. నియమించబడ్డ వీరంతా తాము కూడా పోటీ చేస్తున్నందున వారి నియోజకవర్గాలకే పరిమితమై పార్టీని మానిటర్ చేసుకోవడంలో విఫలమయ్యారనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.