హస్తినాలో రిజల్ట్స్ .. అమరావతిలో వైబ్రేషన్స్: జగన్కు బాబుకు కలిసొచ్చేదేంటి.. నష్టపోయేదేంటి..?
ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయాల్లో మార్పురానుందా.. మళ్లీ తెరపైకి థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం ఉందా..? అదే నిజమైతే కేసీఆర్ పాత్ర ఏంటి..? కేజ్రీవాల్ బుల్లెట్లా దూసుకెళుతారా..? ఇక జాతీయ పార్టీలుగా చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్ల కథ కంచికి చేరుకుంటుందా..? 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు చక్రం తిప్పుతారని భావించినప్పటికీ సొంత రాష్ట్రంలోనే చతికిలపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషిస్తారా..? ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఇప్పుడు అమరావతిలో వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి.
ఢిల్లీ ఫాలోస్ హైదరాబాద్: కేసీఆర్ బాటలోనే కేజ్రీ .. అదే క్రేజ్ అదే గేమ్
చంద్రబాబు ప్లేస్ను కేజ్రీవాల్ రీప్లేస్ చేస్తారా..?
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి ప్రాంతీయ పార్టీ సత్తాను చాటాయి. ఢిల్లీ ఎన్నికల ముఖ చిత్రం నుంచి కాంగ్రెస్ కనుమరుగు కాగా బీజేపీకి అత్యంత చేదు అనుభవాన్ని ఈ ఎన్నికలు మిగిల్చాయి. ఇక అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ ఢిల్లీని స్వీప్ చేయడంతో మరోసారి జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. హస్తినలో ఎన్నికల ఫలితాలు అమరావతిని సైతం షేక్ చేశాయనే చెప్పాలి. 2019 ఎన్నికల సమయంలో బీజేపీని మట్టికరిపించాలన్న ఏకైక లక్ష్యంతో దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో కేజ్రీవాల్కు మద్దతు తెలపక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది కోల్కతా వేదికగా జరిగిన బీజేపీయేతర పార్టీల సమావేశంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. ఆ సమావేశానికి కేసీఆర్ హాజరుకాలేదు. ఒకవేళ మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చి చంద్రబాబు నాయకత్వం చేపట్టాలంటే అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పుకుంటారా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ కేజ్రీకి మద్దతు ఇస్తే జగన్ కూడా...
ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో ఇటు టీఆర్ఎస్ అటు వైసీపీలు మాత్రమే ఒంటరిగా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా 2019లో ఎన్నికలకు వెళ్లాయి. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో ఒంటరిగా అరవింద్ కేజ్రీవాల్ పోరాడి విజయం సాధించారు. దీంతో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ప్లేస్ను అరవింద్ కేజ్రీవాల్ రీప్లేస్ చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఇక జగన్ అటు ఎన్డీయేతో కానీ ఇటు యూపీఏతో కానీ పొత్తు పెట్టుకోకపోవడం ఒకటైతే...కేసీఆర్ కూడా కేజ్రీవాల్కు మద్దతుగా నిలిస్తే జగన్ కూడా కేజ్రీవాల్కు సపోర్ట్ చేసే అవకాశం ఉందని అనలిస్టులు చెబుతున్నారు. ఇదే జరిగితే చంద్రబాబు ఇక్కడ కూడా నెగ్గుకొచ్చే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవనేది నగ్న సత్యం. ఇక బీజేపీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ను దగ్గరకు తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు బీజేపీతో జతకట్టడం ఇప్పట్లో అసాధ్యమే.
కేసీఆర్లో రంగంలోకి దిగితే చంద్రబాబు దూరమే
ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేశారు. మరి జగన్ తనతో కలిసి వస్తానంటే కేజ్రీవాల్ ఒప్పుకుంటారా అనేది కూడా ఆసక్తికరంగా మారుతుందని అనలిస్టులు చెబుతున్నారు. ఇక ఢిల్లీ ఫలితాలతో కేసీఆర్ జాతీయరాజకీయాల్లో మరోసారి కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. మమతా బెనర్జీ కేజ్రీవాల్తో కలిసి మళ్లీ కేసీఆర్ తన రాజకీయ చాణక్యతను ప్రదర్శించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కేసీఆర్ రంగంలోకి దిగితే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును దగ్గరకు తీయడనేది బహిరంగ రహస్యమే. 2019లో చంద్రబాబు కాంగ్రెస్తో జతకట్టి తప్పు చేశారనేది ప్రజలు ఇంకా మరువలేదు.
ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం జాతీయ పార్టీలు వెంపర్లాట
ఇక ఓవరాల్గా చూసుకుంటే జాతీయ పార్టీలకు రానున్న రోజుల్లో మనుగడ ఉండదనేది స్పష్టమవుతోంది. కేవలం ప్రాంతీయ పార్టీలే జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పే సూచనలు కనిపిస్తున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు భవిష్యత్తులో జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం, కేజ్రీవాల్కు క్లీన్ ఇమేజ్ ఉండటం వల్ల థర్డ్ ఫ్రంట్ను ఆయనే లీడ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఉత్తరాది నుంచి మమతా, కేజ్రీవాల్లు ఉండగా దక్షిణాది నుంచి కేసీఆర్ జగన్లు కలిస్తే థర్డ్ ఫ్రంట్ సాధ్యమవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే కేసీఆర్ రాజకీయ అనుభవం దృష్ట్యా తనే ఈ ఫ్రంట్ను లీడ్ చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలుంటాయని అనలిస్టులు భావిస్తున్నారు. ఇక నితీష్ కుమార్ కూడా ఢిల్లీ ఫలితాలతో ఆలోచించే అవకాశం ఉంది. నితీష్ కుమార్కు సీజనల్ పొలిటీషియన్గా పేరుంది. అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నితీష్ తన డెసిషన్ చెప్పే అవకాశం ఉందని చెబుతున్నారు అనలిస్టులు.