రాజస్థాన్లో గొడ్డలితో కార్మికుడి నరికివేత: ఆనంద్ మహీంద్రా ఆగ్రహం
ముంబై: రాజస్థాన్లో జరిగిన దారుణ ఘటనపై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి శిక్ష విధించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.
రాజస్థాన్లోని రాజసమంద్ జిల్లాకు చెందిన శంభూలాల్ అనే వ్యక్తి కోల్కతాకు చెందిన కాంట్రాక్ట్ లేబర్ను దారుణంగా గొడ్డలితో నరికి శవాన్ని దహనం చేశాడు.
అతని బావ ఈ ఘటనను రికార్డ్ చేయడంతో వెలుగు చూసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు.
ఇలాంటి దారుణ హత్యను టెలివిజన్ డ్రామాగా చూపించినప్పుడే అతని కర్కశత్వం తెలుస్తోందని, ఈ విషయంలో వెంటనే న్యాయం జరగాలన్నారు. దీనిపై ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఇలాంటి విషయాల్లో మీరు కామెంట్స్ చేసి పబ్లిసిటీ ఇవ్వవద్దన్నారు.
దానిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. క్షమించాలని, ఈ వీడియో చూసినప్పుడే తాను కళ్లు పక్కకు తిప్పుకున్నానని, ఇలాంటి విషయమై కామెంట్ చేయడం కంటే సమాజం చేస్తున్న నేరాలను షేర్ చేయాలనుకున్నానని చెప్పారు.