రూ. 1కే ‘ఇడ్లీ బామ్మ’కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద మహీంద్ర
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. రూపాయికి ఇడ్లీలు అమ్ముతూ కార్మికులు, పేద ప్రజల ఆకలి తీరుస్తున్న తమిళనాడుకు చెందిన 80ఏళ్ల కమలాతాళ్కు వంట గ్యాస్ ఇప్పించారు. ఆమెకు ఈ వసతి కల్పించినందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పారు.
రూ.1 కే ఇడ్లీలు: 80ఏళ్ల అవ్వ వ్యాపారంలో ఆనంద్ మహీంద్ర పెట్టుబడి!, ప్రశంసలు
కట్టెలపొయ్యిపైనే..
ఇంతకుముందు కట్టెల పొయ్యిపైనే ఇడ్లీలు చేస్తూ తన దగ్గరకు వచ్చే పేద కార్మికులకు రూపాయికే ఇడ్లీలు వడ్డించేది కమలాతాళ్. కొందరు రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయిన తన దగ్గరకు వస్తే ఇడ్లీలు పెట్టేది. దీంతో ఆమెను అంతా ఇడ్లీ బామ్మ, ఇడ్లీ అమ్మగా పిలవడం మొదలుపెట్టారు.
సాయం చేయాలని..
అయితే, కట్టెలపొయ్యిపై ఆ అవ్వ కష్టం చూసిన ఆనంద్ మహీంద్ర ఆమెకు తనవంతు సాయం చేయాలని అనుకున్నారు. వెంటనే తాను ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెడతానని, గ్యాస్ కనెక్షన్ కూడా ఇప్పిస్తానని చెప్పారు. అయితే ఆమె లాభాపేక్ష లేకుండా సేవ చేస్తుందనే విషయం తనకు తెలుసని, ఆమెకు సేవకు తాను కొంత సాయమాత్రమే అందిస్తున్నానని చెప్పుకొచ్చారు.
కృతజ్ఞతలు..
కాగా, మహీంద్రా ట్వీట్ చేసిన మరుసటి రోజే కమలాతాళ్కు వంట గ్యాస్ కనెక్షన్ అందించినట్లు కోయంబత్తూరు భారత్ గ్యాస్ విభాగం మహీంద్రాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. దీంతో ఆనంద్ మహీంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోయంబత్తూరు భారత్ గ్యాస్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
చెప్పిన విధంగానే..
ఈ సందర్భంగా పెట్రోల్, గ్యాస్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కూడా ఆనంద్ మహీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఆమెకు సాయం చేస్తానని ముందే చెప్పాను. ఇప్పుడు చేస్తున్నా. ఆమెకు వంట గ్యాస్కు ఖర్చును మొత్తం నిరంతరాయంగా నేనే భరిస్తానని ఆనంద్ మహీంద్ర చెప్పుకొచ్చారు.