టెక్కీకి షాక్: 'నీ ఉద్యోగం ఊడింది..'పై ఆనంద్ మహింద్రా క్షమాపణ
ఆనంద్ మహీంద్రా, టెక్ మహీంద్రా సీఈవో సిపి గుర్నానీలు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. నీ ఉద్యోగం పోయింది, నీవు రేపటి నుంచి ఆఫీస్కు రావొద్దని ఓ ఉద్యోగికి హెచ్ఆర్ చెప్పిన మాటలు వైరల్ అయింది.
బెంగళూరు: మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టెక్ మహీంద్రా సీఈవో సిపి గుర్నానీలు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. నీ ఉద్యోగం పోయింది, నీవు రేపటి నుంచి ఆఫీస్కు రావొద్దని ఓ ఉద్యోగికి హెచ్ఆర్ చెప్పిన మాటలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
'నీ ఉద్యోగం పోయింది.. రేపట్నుంచి రావొద్దు': టెక్కీకి హెచ్ఆర్ షాక్
ఆనంద్ మహీంద్రా క్షమాపణ
దీనిపై ఆనంద్ మహీంద్రా, సిపి గుర్నానీలు క్షమాపణ చెప్పారు. ఈ సంఘటనపై తాను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానని, ప్రతి ఒక్కరి గౌరవాన్ని, విలువను కాపాడటమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని భరోసా ఇస్తున్నానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
టెక్ మహీంద్రా ప్రకటన
టెక్ మహీంద్రా సీఈవో సిపి గుర్నానీ కంపెనీకి సంబంధించిన లేఖను ట్వీట్ చేశారు. అందులో కూడా క్షమాపణ చెప్పారు. ఉద్యోగుల పట్ల టెక్ మహీంద్రా గౌరవంతో ఉంటుందని, ఏళ్లుగా విలువలు కొనసాగిస్తున్నామని ట్వీట్ చేసిన లేఖలో ఉంది. కంపెనీ హెచ్ఆర్, ఉద్యోగి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలిసిందని, దీనిపై తాము చింతిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవని చెప్పారు.
కాగా, మహీంద్రా గ్రూప్కు చెందిన కంపెనీ నుంచి ఓ ఉద్యోగిని ఇటీవల అర్ధాంతరంగా తొలగించారు. తొలగింపునకు గురైన ఉద్యోగితో హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ వారు చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన సంభాషణలు రికార్డు కావడం, అవి బయటకు రావడమే కాకుండా, సామాజిక మాధ్యమాలకు చేరాయి.
నీ ఉద్యోగ ఊడిందని..
టెక్ మహీంద్రాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 'నీ ఉద్యోగం పోయింది. నీవు రేపటినుంచి ఆఫీసుకు రావొద్దు' అని ఓ ఉద్యోగికి సంస్థ నియామక(హెచ్ఆర్) అధికారులు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ఆ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ చెప్పడం గమనార్హం. అంతేగాక, ఇది కార్పొరేట్ నిర్ణయమని.. ఉద్యోగానికి రాజీనామ చేయమని ఉద్యోగిని కోరడం సంచలనంగా మారింది.
రికార్డ్ చేసిన ఉద్యోగి
సదరు ఉద్యోగి ఇదంతా రికార్డు చేయడం, ఆన్లైన్ పెట్టడంతో ఇప్పుడు అది వైరల్గా మారింది. 6.45నిమిషాలపాటు సదరు ఉద్యోగితో.. సంస్థ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ సంభాషణ జరిపారు. మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు అతని రాజీనామా లేఖను అందజేయాలని.. లేదంటే సంస్థే తొలగిస్తుందని హెచ్చరించారు. ‘ఖర్చుల నియంత్రణలో భాగంగా కొందరు ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. ఆ జాబితాలో నీ పేరు కూడా ఉంది. నీవు రాజీనామా లేఖ ఇస్తే.. సాధారణంగా సంస్థ నుంచి వెళ్లిపోయినట్లు జూన్ 15 వరకు రిలీవ్ చేస్తాం. లేదంటే సంస్థ నుంచి తొలగించేస్తాం. ఆ లేఖను మీకు పంపిస్తాం' అని హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ తేల్చి చెప్పారు.
వాదనకు దిగారు
తాను సంస్థలో ఎంతో బాగా పని చేస్తున్నప్పటికీ ఎలాంటి కారణం లేకుండా తొలగిస్తుండటం పట్ల సదరు ఉద్యోగి.. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్తో వాదనకు దిగారు. తనను ఎందుకు తొలగిస్తున్నారో సరైన కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ‘సంస్థ నియామకం సందర్భంలోనే ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన స్పష్టమైన వివరాలు పేర్కొంది. సంస్థకు ఎప్పుడైనా ఉద్యోగులను బయటికి పంపవచ్చు' అని ఆ మహిళ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేశారు. అయినా.. కాసేపు సదరు అధికారిణితో ఉద్యోగి వాదించాడు. చివరకు ‘ఇది చాలా దురదృష్టకర చర్య.. మేడమ్' అంటూ తన సంభాషణ ముగించారు సదరు టెక్కీ. ఆ తర్వాత టెక్ మహీంద్రలో జరిగిన ఈ సంభాషణ రికార్డింగ్ను సంస్థ హెచ్ఆర్ మేనేజర్ లింక్డిన్ ప్రొఫైల్ తోపాటు వైరల్ చేశాడు సదరు ఉద్యోగి.
I want to add my personal apology. Our core value is to preserve the dignity of the individual & we'll ensure this does not happen in future https://t.co/yBxAxvFZlc
— anand mahindra (@anandmahindra) July 7, 2017
I deeply regret the way the HR rep & employee discussion was done. We have taken the right steps to ensure it doesn’t repeat in the future. pic.twitter.com/KKLt6tIBb6
— CP Gurnani (@C_P_Gurnani) July 7, 2017