కాంగ్రెస్లో మళ్లీ అసమ్మతి- మోడీకి మద్దతుగా ఆనంద్శర్మ ట్వీట్- నేతల ఆగ్రహం..
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాయకత్వ సంక్షోభం ఆ పార్టీలో నేతలను కుదురుగా ఉండనీయడం లేదు. ఒకరి తర్వాత ఒకరుగా పార్టీని, అధినాయకత్వాన్ని ధిక్కరిస్తూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తిరిగి వాటికే పార్టీ బాగు కోసమే అనే కలరింగ్ కూడా ఇస్తున్నారు. దీంతో వీరిని ఎలా కట్టడి చేయాలో తెలియక అధినేత్రి సోనియాగాంధీ తలపట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, సీనియర్ రాజ్యసభ ఎంపీ ఆనంద్శర్మ తాజాగా ప్రధాని మోడీని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఇందులో ఆయన మూడు నగరాల్లోని కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్ధలను సందర్శించడంపై ప్రశంసల జల్లు కురిపించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాని వ్యాక్సిన్ టూర్ను ఫొటో ఆపరేషన్గా, శాస్త్రవేత్తల శ్రమను తనదిగా చెప్పుకునే ప్రయత్నంగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆనంద్ శర్మ ట్వీట్ పార్టీ వైఖరికి భిన్నంగా ఉంది.
గతంలో కాంగ్రెస్ పార్టీలో పరిణామాలపై అధినేత్రి సోనియగాంధీకి లేఖ రాసిన 22 మందిలో ఆనంద్ శర్మ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానిని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్పై పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని ఆనంద్ శర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి. అయితే గతంలో సోనియాగాంధీకి రాజకీయ సలహాదారుగా ఉన్న అహ్మద్ పటేల్ ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఆమెకు దిశానిర్దేశం చేసేవారు. తాజాగా పటేల్ మృతితో ఆనంద్శర్మ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోందన్న అంశం ఆసక్తి రేపుతోంది.